నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన మైనర్ బాలుడు
శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతున్న నేటి రోజుల్లో కూడా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో అత్యాచార ఘటనలు ఆందోళనకరంగా మారాయి. ఆమ్నీషియా పబ్ ఘటన తర్వాత మైనర్ బాలికలపై వరుస అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఇక తాజాగా నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం కలకలం రేపుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి తోడుగా వచ్చిన 11 ఏళ్ల మైనర్ బాలికపై మరో 17 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆసుపత్రి పై అంతస్తు నిర్మాణ పనులు చేస్తున్న బాలుడు, బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచార యత్నం చేశాడు. బాలికను ఓ గదిలోకి తీసుకెళ్ళి తలుపు పెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్ గుర్తించాడు. వెంటనే బాలుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి, బాలికను బంధువులకు అప్పగించాడు సెక్యూరిటీ గార్డు. సెక్యూరిటీ గార్డు అలెర్ట్ అవడంతో 11 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు చెక్ పడింది.
ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న నారాయణఖేడ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. నారాయణఖేడ్ మండల పరిధిలో తల్లిదండ్రులతో కలిసి నివసించే 14 సంవత్సరాల బాలికను స్థానికంగా నివసించే నవీన్ అనే యువకుడు కొద్ది రోజులుగా పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 6వ తేదీన నవీన్ ఇంట్లో నుండి తీసుకెళ్ళాడు. బాలిక ఇంటికి రాకపోవటంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు నారాయణ ఖేడ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకుని బాలిక పై అత్యాచారం గురించి తెలుసుకుని పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు.వరుస ఘటనలు తెలంగాణా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి.