ఉపేక్షించేది లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్, పరుగులు పెట్టిన కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఉన్నతాధికారులు నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్.. కిషన్ రెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టడం ఇందుకు కారణం. కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్ గైర్హాజరయ్యారు.
ఇక ఉపేక్షించేది లేదంటూ కిషన్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్ టూరిజం ప్లాజా లో నిర్వహిస్తున్న దిశ కమిటీ మీటింగ్కు ఈ ఉన్నతాధికారులు హాజరుకాలేదు. దీంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీ నిర్లక్ష్యం, లెక్కచేయని తీరును ఎంత మాత్రం ఉపేక్షించేది లేదంటూ తీవ్రంగా హెచ్చరించారు. గంటలో మీటింగ్కు రాకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది అంటూ కేంద్రమంత్రి సీరియస్ అయ్యారు.
కిషన్ రెడ్డి సీరియస్: కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పరుగులు
కాగా, ఈ విషయాన్ని మిగతా అధికారులు ఫోన్ చేసి చెప్పడంతో... కలెక్టర్. కమిషనర్ హుటాహుటిన పరుగులు తీస్తూ.. సమావేశానికి వచ్చారు. హైదరాబాద్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమావేశంలో కిషన్ రెడ్డి చర్చించారు. కరోనా వ్యాక్సిన్ అందరికీ అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద 20కోట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు.
రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల సహకారంతో బస్తీల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరారు. ఇతర దేశాలు భారత్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాయని వివరించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బస్తీ దావాఖానాలను సమర్ధవంతంగా నిర్వహించాలని కేంద్రమంత్రి సూచించారు. పథకాలు అమలు చేస్తున్నప్పుడు తలెత్తే సమస్యలను అధికారులు గుర్తించాలన్నారు కిషన్ రెడ్డి. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే పథకాల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందన్నారు. స్వనిధి యోజన పథకం హైదరాబాద్లో అధికారులు బాగా అమలు చేశారని ప్రశంసించారు. వీధి వ్యాపారులుగా గుర్తింపు కార్డు ఇవ్వడంలో ఆలస్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, దిశ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మేం ధ్వంసం చేయలేదు: బీజేపీ కార్పొరేటర్లు
ఇది ఇలావుండగా, జీహెచ్ఎంసీ కార్యాలయంలో దాడుల అంశంపై బీజేపీ కార్పొరేటర్లు వివరణ ఇచ్చారు. తాము జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎలాంటి దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. బల్దియా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని, అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని నిరసన వ్యక్తం చేశామని తెలిపారు.
శాంతియుతంగా సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసుల తోపులాట వల్ల పూల కుండీలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇప్పటికైనా కౌన్సిల్ సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆందోళన చేసిన బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని నిరసన తెలిపారు.
జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు ప్రజల ఆస్తిని ధ్వంసం చేసిన ఆరోపణలతో 32 మంది కార్పొరేటర్లపై సైఫా బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం కార్పొరేటర్లతోపాటు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తామని సైఫాబాద్ సీఐ తెలిపారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ కూడా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ను కోరారు. ఈ క్రమంలో పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు.