మిషన్ తెలంగాణా...జీహెచ్ఎంసీ కార్పోరేటర్లతో ప్రధాని భేటీ.. తెలంగాణాపై మోడీ గురి!!
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం పై పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా మిషన్ తెలంగాణా మొదలుపెట్టింది. బిజెపి అధినాయకత్వం రాష్ట్రంపై నజర్ పెట్టినట్టు తాజా పరిణామాలతో అర్థమవుతుంది. తెలంగాణాలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్న బిజెపి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లే అనేక ప్రయత్నాలను చేసింది. పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దింపి తెలంగాణపై పట్టు కోసం పని చేస్తోంది. ఇక ఇదే క్రమంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన బీజేపీ కార్పొరేటర్ లతో భేటీ నిర్వహించారు. ఈ భేటీ కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మోడీ సమావేశం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సమావేశమై తెలంగాణలో సుపరిపాలన లక్ష్యంగా, కెసిఆర్ ప్రభుత్వ దుష్పరిపాలనకు స్వస్తి పలికేందుకు పార్టీ కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజానీకం బిజెపి వైపు చూస్తోందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం తమదేనని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
బిజెపికి 80 నుండి 90 సీట్లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) 2019 లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఉపఎన్నికలు మరియు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో సహా అద్భుతమైన ఫలితాలను సాధించిన తర్వాత దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణపై గట్టిగా ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోంది.
కార్పొరేటర్లు ఎమ్మెల్యేల తరహాలో కొట్లాడాలి: మోడీ
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీతో కార్పొరేటర్ల భేటీ కార్యక్రమం కొనసాగింది. కార్పొరేటర్లతో పాటు తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ కుమార్, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. రానున్న ఎన్నికల కోసం బాగా పని చేయాలని కార్పొరేటర్లకు మోడీ దిశానిర్దేశం చేశారు. బిజెపి నుండి ఎన్నికైన 47 మంది కార్పొరేటర్లు 47 మంది ఎమ్మెల్యేల తరహాలో పోరాటం చేయాలని మోడీ సూచించారు.
కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేసిన మోడీ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి ఒక్క కార్పొరేటర్ తో మాట్లాడుతూ వారి కుటుంబ పరిస్థితులను మోడీ అడిగి తెలుసుకున్నారు.వచ్చే ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో బిజెపి ని గెలిపించడానికి గెలిచిన కార్పొరేటర్లు కీలక భూమిక పోషించాలని ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేశారు.
ట్వీట్ చేసిన ప్రధాని మోడీ ..
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విటర్లో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని జిహెచ్ఎంసిలోని బిజెపి కార్పొరేటర్లను మరియు తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నాయకులను కలిశాము. ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టడం మరియు అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయం చేయాలనే దానిపై కూడా విస్తృత చర్చలు చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో సుపరిపాలన లక్ష్యంగా, వంశపారంపర్య దుష్పరిపాలనకు ముగింపు పలికేందుకు బిజెపి పని చేస్తుంది అని ప్రధాని మోడీ ట్వీట్లో పేర్కొన్నారు.
టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ... అందుకే మోడీ ప్రత్యేక దృష్టి
దక్షిణాది రాష్ట్రంలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమికి మద్దతునిచ్చే పనిలో ఉన్నారు. ఇక ఇదే సమయంలో కర్ణాటక మినహాయించి దక్షిణ భారతదేశంలో బిజెపి ఇప్పటివరకు ఎక్కడ గట్టిగా సత్తా చాటలేకపోయింది.
అయితే తెలంగాణలో దాని ఇటీవలి ప్రదర్శన నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనే ఆశను పార్టీలో నింపింది. వచ్చే నెలలో హైదరాబాద్లో కాషాయ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. ఈ క్రమంలో బీజేపీ కార్పోరేటర్లతో ప్రధాని భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మోడీ తెలంగాణాపై గురి పెట్టినట్టు స్పష్టంగా అర్ధం అవుతుంది.