బంద్: బాబు హెరిటేజ్ తెరిచారు, రేవంత్ అరెస్ట్: అందరూ ఠాణాల్లోనే (పిక్చర్స్)
హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారం కోసం విపక్ష పార్టీలు శనివారం చేపట్టిన బంద్ తెలంగాణవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్తో సహా అన్నిజిల్లాల్లో జరిగిన బంద్లో కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సీపీఎం, సీపీఐ, వైసిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆయాప్రాంతాల్లో బస్ డిపోలను దిగ్బంధించారు. బంద్లో పాల్గొన్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో అన్ని పార్టీలకు చెందిన అధ్యక్షులు, ముఖ్య నేతలు బందులో పాల్గొన్నారు.
పోలీసులు ఉదయం నుంచే అరెస్టుల పర్వం ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, టిడిపి నేతలు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, బిజెపి నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, వామపక్ష, వైసిపి నేతలను అరెస్టు చేశారు.
పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. కొన్నిచోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి. హైదరాబాదులో బంద్ పాక్షికంగా కనిపించింది. అయితే, జిల్లాల్లో మాత్రం ప్రభావం కనిపించింది. దీంతో, రైతుల మద్దతు విపక్షాలకు కనిపించిందని చెబుతున్నారు. హైదరాబాదులో మాత్రం బంద్ ప్రభావం పెద్ద మొత్తంలో కనిపించలేదు.
మరోవైపు హైదరాబాదులో బంద్ విఫలమైందంటూ... కెసిఆర్ నమస్తే తెలంగాణ పత్రికలో.. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ప్రెష్ స్టోర్స్ (ఆర్టీసీ క్రాస్ రోడ్స్) ఫోటోను ఇచ్చారు. అయితే, జిల్లాల్లో బంద్ సఫలమైందని, రైతుల మద్దతుతో ఇది విజయవంతమైందంటున్నారు.
తెలంగాణ బంద్
బంద్ నేపథ్యంలో.. సచివాలయం ముట్టడికి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ బంద్
గోషామహల్ స్టేషన్లో ఉన్న కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులను సీఎల్పీ నేత జానారెడ్డి పరామర్శించారు. వారు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్ద ధర్నాకు దిగారు.
తెలంగాణ బంద్
నల్గొండ జిల్లాలో ఆయాప్రాంతాల్లో విపక్ష నేతలు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. నిరసన తెలుపుతున్న దాదాపు వేలాది మందిని అరెస్టు చేశారు.
తెలంగాణ బంద్
కరీంనగర్ జిల్లాలో జరిగిన నిరసనల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. హుస్నాబాద్లో బస్సులను అడ్డుకుంటున్న సందర్భంగా బస్సు అద్దం పగలగొట్టారు.
తెలంగాణ బంద్
ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఆందోళనల సందర్భంగా ఖమ్మం ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం వదిలేశారు.
తెలంగాణ బంద్
నిజామాబాద్ జిల్లాలో దాదాపు మొత్తం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిజామాబాద్లో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ లలితతో పాటు కాంగ్రెస్, టిడిపి జిల్లా అధ్యక్షులను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ బంద్
హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బస్సుల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు స్వల్పంగా ధ్వంసం చేశారు.
తెలంగాణ బంద్
వైసిపి రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీగా బయలుదేరి హన్మకొండ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ బంద్
పాలమూరు జిల్లా వనపర్తిలో ఆందోళన సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రసంగాన్ని పోలీసులు అడ్డుకొని, బలవంతంగా అరెస్టు చేయడంతో కొందరు రెండు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు.
తెలంగాణ బంద్
ఆందోళనల సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, నారాయణపేట తెదేపా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ బంద్
టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ విజయవంతం అయిందని బిజెపి నేత సాంబమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ బంద్
బంద్ను విఫలం చేయడానికి ప్రభుత్వం అనేక కుట్రలు పన్నిందని, బంద్ విజయవంతం అవడాన్ని జీర్ణించుకోలేక కొందరు మంత్రులు అనేక విమర్శలు చేస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి.
తెలంగాణ బంద్
అరెస్టులను అధిగమించి బంద్ను విజయవంతం చేసిన ప్రజలందరికీ విపక్షాలు అన్నీ ధన్యవాదాలు తెలిపాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుల రుణాలను ఏకకాలంలో రద్దు చేయాలని, ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ బంద్
అనేకచోట్ల పలు పార్టీల కార్యకర్తలు, ప్రజలు, రైతులు బస్సు డిపోల ఎదుట ధర్నాలతో బస్సులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో కొద్దిసేపటి తరువాత ఆర్టీసీ బస్సులు యథాతథంగా నడిచాయి.