ఖమ్మంకు ముగ్గురు మంత్రులా, ఓపిక పడుతున్నా - కోమటిరెడ్డి అల్టిమేటం..!!
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం సంచలనంగా మారుతోంది. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి.. ఇవ్వకపోవటం పైన రాజగోపాల్ రెడ్డి ప్రతీ సందర్భంలోనూ నిలదీస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ తానే పదేళ్లుగా సీఎంగా ఉంటానని చేసిన వ్యాఖ్యలు.. మీడియా పైన స్పందించిన తీరును రాజగోపాల్ రెడ్డి కౌంటర్ చేసారు. ఇక.. ఇప్పుడు ఖమ్మంలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చి.. నల్గొండకు ఇవ్వటానికి అడ్డు ఏంటని నిలదీసారు. తనకు హామీ ఇచ్చిన సమయంలో తన అన్న గురించి తెలియదా అంటూ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టేనని చెప్పకొచ్చారు. తనకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నానని పేర్కొన్నారు. మంత్రి పదవి పైన మాట ఇచ్చారని.. ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ, అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని కోరారు. ఇస్తామన్నమాట ఆలస్యమైంది సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారని.. అసలు సమీకరణాలు ఎందుకు కుదరటం లేదని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు.

తనను కాంగ్రెస్ లోకి తీసుకున్నప్పుడు తాము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని తెలియదా అంటూ నిలదీసారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని అంటూ ప్రశ్నించారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందని వ్యాఖ్యానించారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారని గుర్తు చేసారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా అంటూ రాజగోపాల్ రెడ్డి కొత్త చర్చకు తెర లేపారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నానని.. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications