రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పాయంకు గాయాలు: ఆస్పత్రికి తరలింపు
భద్రాచలం: గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం పినపాక పట్టినగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కారు.. ఓ ట్రాలీ ఆటో ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పాయం వెంకటేశ్వర్లకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎమ్మెల్యే తన కారులో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.
రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ ఎస్ఐ మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడులో ఎక్సైజ్ ఎస్సైగా పనిచేస్తున్న జల్లెపల్లి రాంబాబు (39) స్థానిక వేంసూరు రోడ్డులో షాదీఖానా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇతని స్వగ్రామం ఖమ్మం సమీపంలోని తల్లంపాడు. సత్తుపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాంబాబు స్థానిక షాధీఖానా వద్ద బుధవారం రాత్రి ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా స్థానిక ఎన్టీఆర్నగర్కు చెందిన ఉర్మిల సురేశ్ అనే వ్యక్తి కారుతో ఢీ కొట్టడంతో రాంబాబు తలకు బలమైన గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు రాంబాబును సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. రాంబాబును ఢీకొన్న కారు గురించి స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. సురేశ్ కారును సత్తుపల్లి సమీపంలోని రాజీవ్నగర్లో గల తన బందువుల ఇంటికి తీసుకెళ్లి అక్కడ దాని నంబరు ప్లేట్ను తొలగించారు.
ఈ విషయం పోలీసులు విచారణలో బయట పడింది. శవపరీక్ష నిర్వహించిన అనంతరం మృత దేహాన్ని బంధువులకు అప్పగించారు. గురువారం సాయంత్రం ప్రమాదానికి కారకుడైన సురేశ్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మృతుడు రాంబాబుకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు.