రూ.300 కోట్లు సంపాదించేవాడిని: ఎంపీ మల్లారెడ్డిపై సాయన్న ఆగ్రహం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ మల్లారెడ్డి పైన ఇటీవలె తెరాసలో చేరిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న శనివారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను డబ్బుకోసం ఆలోచించే వాడిని అయితే 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇప్పటికే రూ.300 కోట్లు సంపాదించి ఉండేవాడినన్నారు.
గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన సాయన్న మూడు రోజుల క్రితం తెరాసలో చేరారు. సాయన్న పార్టీ మారడంపై ఎంపీ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసమే ఆయన కారు ఎక్కారని ఆరోపించారు. దీనిపై సాయన్న స్పందించారు.
తాను డబ్బులకు అమ్ముడుపోయానని ఎంపీ మల్లారెడ్డి ఆరోపించడం సరికాదన్నారు. తన ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తన పైన కనీసం మూడేళ్ల అనుభవం లేని మల్లారెడ్డి ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. తన గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు.
తన కళాశాల సిబ్బందితో మాట్లాడినట్లు మాట్లాడితే వదిలేది లేదన్నారు. మల్లారెడ్డి పలు వేదికల పైన చేసిన ప్రసంగాలు వాట్సాప్లో ఉన్నాయని, ఆయన చేసిన గాంగ్నం నృత్యాలు, యువతను తప్పుదారి పట్టించేలా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఎంపీకి మతిస్థిమితం సరిగా లేదనిపిస్తోందన్నారు.
చంద్రబాబును కలిసిన ప్రకాశ్ గౌడ్
టిడిపి అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆదివారం కలిశారు. రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల తాజా పరిస్థితి పైన ఆయన వివరించారు.