స్వరాష్ట్రంలో గిరిజనులను కాల్చి చంపిన ఘనత సీఎం కేసీఆర్ ది : ఇంద్రవెల్లి సభపై ఉత్కంఠ , సీతక్క ఎదురుదాడి
తెలంగాణా రాష్ట్రంలో ఇంద్రవెల్లిలో జరుగుతున్న సభ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంద్రవెల్లి సాక్షిగా పోరాటాలకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చలో ఇంద్రవెల్లికి పిలుపునివ్వడంతో హై టెన్షన్ నెలకొంది. వివిధ ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఇంద్రవెల్లి గడ్డ నుండే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలను అందుకున్న తర్వాత ఏర్పాటు చేసిన తొలి బహిరంగ సభ ఇది కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఈ సభను విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
ఇంద్రవెల్లి సభపై సర్వత్రా ఉత్కంఠ... టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
టిఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక ఎదురుదాడిలో భాగంగా ఇంద్రవెల్లి లో 40 సంవత్సరాల క్రితం ఆదివాసీ గిరిజనులపై కాల్పులు జరిపిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని దళిత గిరిజనుల కోసం ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తోందని ప్రశ్నిస్తున్నారు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని టిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది.
ఈ క్రమంలో ఇంద్రవెల్లి సభలో పాల్గొనడానికి వెళ్లిన ములుగు ఎమ్మెల్యే సీతక్క రేవంత్ కు మద్దతుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంద్రవెల్లి సభలో పాల్గొనటం కోసం వెళ్ళిన సీతక్క అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. దళిత గిరిజనులకు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడతామన్న భయంతో టిఆర్ఎస్ పార్టీ గతంలో ఎప్పుడో జరిగిన వ్యవహారాన్ని తెరమీదకు తీసుకు వస్తుందని స్పష్టం చేశారు.
సమైక్య పాలనలో జరిగింది కాదు మీ పాలనలో జరిగింది చెప్పండి : సీతక్క ప్రశ్న
సమైక్య పాలనలో జరిగిన కాల్పులు గురించి ప్రస్తావించటం సరికాదని పేర్కొన్నారు ఎమ్మెల్యే సీతక్క. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా గిరిజనులను కాల్చి చంపిన ఘనత సీఎం కేసీఆర్ ది అని నిప్పులు చెరిగారు. ఆనాటి తప్పును కాంగ్రెస్ సరిదిద్దుకుని, ఆదివాసులకు క్షమాపణ కూడా చెప్పిందని పేర్కొన్న ఎమ్మెల్యే సీతక్క టిఆర్ఎస్ పార్టీ హయాంలో, ప్రస్తుత పాలనలో ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
అంతకుముందు ఇంద్రవెల్లి లో నిర్వహించే సభ ఆదివాసులకు వ్యతిరేకం కాదని, దళిత గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సభ అడ్డుకునే ప్రయత్నాల్ని కొందరు కావాలని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంద్రవెల్లిలో 1200మంది పోలీసులతో భారీ బందోబస్తు
దళిత గిరిజనుల సమస్యల పరిష్కారం కోసమే దళిత గిరిజన దండోరా అని పేర్కొన్న ఎమ్మెల్యే సీతక్క దళితులకు గిరిజనులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పోరాటం సాగుతోందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో దళితుల ,గిరిజనుల హక్కులను కాపాడడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇంద్రవెల్లి కాంగ్రెస్ సభను అడ్డుకుని తీరుతామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంద్రవెల్లి లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క టిఆర్ఎస్ పార్టీ నేతలు సైతం ఇంద్రవెల్లి లో జరుగుతున్న దళిత గిరిజన దండోరా అడ్డుకోవడానికి దళిత గిరిజన సంఘాలకు పిలుపునిస్తున్నట్లుగా సమాచారం .
ఈ క్రమంలోనే ఇంద్రవెల్లిలో పన్నెండు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను సైతం రంగంలోకి దింపి భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు.
రేవంత్ కు టీఆర్ఎస్ నేతలు వేస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పిన సీతక్క
కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాభవాన్ని కోల్పోయిన సమయంలో రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించి తెలంగాణ రాష్ట్రంలో దూకుడు చూపించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ గా రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించడంతో పాటుగా, అధికార పార్టీకి చుక్కలు చూపించే పనిలో పడ్డారు.
ఇటీవల సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు, గిరిజనులకు ఈ పథకం ద్వారా న్యాయం చేయాలని అందరికీ లబ్ధి చేకూర్చాలని ప్రధాన డిమాండ్ తో పెద్ద ఎత్తున దళిత గిరిజన దండోరా నిర్వహించి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈరోజు సభ పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఆదివాసీలను పొట్టనబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలకు ఆదివాసి బిడ్డ, గిరిజన ఎమ్మెల్యే, గిరిజన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క సమాధానం చెప్పారు.
దళిత గిరిజన దండోరా సక్సెస్ చెయ్యాలని సీతక్క పిలుపు
సీతక్క కెసిఆర్ ను టార్గెట్ చేస్తున్నారు . స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఆదివాసీలను చంపిన చరిత్ర కెసిఆర్ దని, దీనిపై టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కరోనా కష్టకాలంలో గిరిజన గూడేలకు వెళ్లి వాళ్లకు కావలసిన నిత్యావసర వస్తువులను ఇచ్చి, కరోనా పై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే సీతక్క, అటవీ అధికారులు, పోడు భూములకు కంచెలు వేసి గిరిజనులు పోడు వ్యవసాయం చేయకుండా అడ్డుకోవడంపై నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు.
గిరిజన గ్రామాల్లో ప్రజల ప్రజల దయనీయ పరిస్థితులను తెలుసుకుని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిస్తున్నారు.