రెడ్లు, వెలమలకు బలుపు ..ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదం .. ఆపై వక్రీకరించారని వివరణ!!
మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రెడ్డి, వెలమ కులాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి. ఆయన క్రిస్మస్ సందర్భంగా కేసముద్రంలో చర్చ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెడ్డి, వెలమ అన్న బలుపు అంటూ ఆయన వ్యాఖ్యానించటం సదరు సామాజిక వర్గాల ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇక ఈ దుమారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా తాజాగా ఆయన తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, సదరు కులాల సహకారంతోనే ఎమ్మెల్యే అయ్యానని చెప్పుకొచ్చారు .
ఇంతకీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యల వ్యవహారానికి వస్తే మనుషుల్లో మూడు రకాల బలుపు ఉంటుందని చెప్పిన ఆయన రెండు రకాల కులాల పేర్లను నేరుగా ప్రస్తావించారు. ఆ రెండు కులాలతో పాటు డబ్బు, చదువు అనే బలుపులు మనుషులకు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు . మనిషికి మూడు బలుపులుంటాయి ఈ ప్రపంచంలో.
ఏం బలుపయా అంటే.. ఒకటి నేను రెడ్డి, నేను వెలమ అనే బలుపు. ఒకటి నా దగ్గర బాగా డబ్బుందనే బలుపు. నేను బాగా చదువుకున్నా అనే బలుపు" అంటూ అందరూ షాకయ్యేలా మాట్లాడారు శంకర్ నాయక్.

అంతేకాదు ఎవర్ని కోసినా రక్తమే వస్తుందన్న ఆయన అందరం కలిసి మెలిసి ఉండటం ముఖ్యమన్నారు. ఆయన భావం మంచిదే అయినప్పటికీ ఆయన రెడ్డి, వెలమ అంటూ కులాల ప్రస్థావన తీసుకువచ్చి చేసిన వ్యాఖ్యలపై సదరు సామాజిక వర్గాలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇక ఈ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలపై ఆయన వెనక్కి తగ్గారు. తాను కావాలని ఎవరీనీ కించపరచలేదని పేర్కొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. తన మాటలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని కోరారు. తాను రెడ్డి, వెలమ సామాజిక వర్గ సహకారంతోనే ఎమ్మెల్యే అయ్యానని పేర్కొన్నారు. కొందరు కావాలనే తన వ్యాఖ్యలపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications