కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలనం; నియోజకవర్గంలో కాలుపెట్టనివ్వనని శపథం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య పొసగడం లేదా? స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు, మాజీ మంత్రి కడియం శ్రీహరికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందా? వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ నేతల మధ్య పోరాటం కొనసాగుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి కడియం శ్రీహరి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో ఎంతోమంది నక్సలైట్లను పొట్టన పెట్టుకున్నారని తాటికొండ రాజయ్య మాటల దాడి చేశారు. కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు 361 మంది నక్సలైట్లను పొట్టనబెట్టుకున్నారని తాటికొండ రాజయ్య ఆరోపించారు. ఒక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే ఇంత మంది చనిపోయారని తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు.

సీఎం కేసీఆర్ తనకు దేవుడు అన్న తాటికొండ రాజయ్య
కడియం శ్రీహరి టీడీపీ నుండి అతనికి గిట్టనివారిని ఎన్కౌంటర్లు చేయించాడని, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లోనే 361 మంది అమాయకులను చంపారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఇక తనకు రాజకీయ గురువు వైయస్ రాజశేఖర్ రెడ్డి అయితే, ప్రస్తుతం సీఎం కేసీఆర్ తనకు దేవుడని తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం పెద్ద పెండ్యాల లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న తాటికొండ రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

స్టేషన్ ఘనపూర్ లో ఎవరినీ కాలుపెట్టనివ్వను అన్న ఎమ్మెల్యే
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి తాను పూజారిని అని, సీఎం కేసీఆర్ దేవుడని పేర్కొన్న ఆయన ఆ దేవుడిచ్చిన వరాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా అని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ ఎప్పటికీ తన అడ్డా అని పేర్కొన్న తాటికొండ రాజయ్య, ఎట్టి పరిస్థితులలోనూ స్టేషన్ ఘనపూర్ లో ఎవరిని కాలు పెట్టనివ్వనని శపథం చేశారు. ఇక ఇప్పటికే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్యకు, కడియం శ్రీహరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.

రాజయ్య వ్యాఖ్యలతో పెరిగిన పొలిటికల్ హీట్
ఇప్పుడు తాజాగా మరో మారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన సంచలన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు టికెట్టు తమకే రావాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కడియం శ్రీహరి రాజయ్య వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications