ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో సిట్ కు షాక్!!
తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. ఈ కేసులో దూకుడుగా ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న సిట్ కు అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ కేసులో మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి యల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గు స్వామి, కరీంనగర్ కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ లను నిందితులుగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. అయితే విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసులు దాఖలు చేసిన మెమోను కొట్టివేసింది. సిట్ దాఖలు చేసిన మెమోపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయస్థానం దానిని తిరస్కరించింది.
ఇదిలా ఉంటే ఈ కేసులో నోటీసులు అందుకున్న బిఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా వాదనలు విన్న హైకోర్టు ఆయనకు ఊరటనిచ్చింది. మొదట డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే విధించిన ధర్మాసనం, మళ్లీ స్టే ను ఈనెల 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు తుషార్, జగ్గుస్వామిలు సైతం సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయించారు. ఇక వాటిపై కూడా న్యాయస్థానం స్టే విధించడంతో సిట్ అధికారులకు ఈ కేసులో ముందుకు ఎలా వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఇక మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముగ్గురు నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. ఇక బెయిల్ కోసం ప్రయత్నం చేసిన వారికి ఇటీవల హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారికి బెయిల్ ఇవ్వద్దని బెయిల్ ఇస్తే వారు సాక్ష్యాలను తారుమారు చేస్తారని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించినప్పటికీ, హైకోర్టు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.