ఎమ్మెల్యేల ఎరకేసు: బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలను అరెస్ట్ చెయ్యటం సిట్ కు సాధ్యమేనా?
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు బిజెపి ప్రయత్నం చేసిందని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామి లను ఆడియో, వీడియో రికార్డులతో పాటు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ కేసు దర్యాప్తు కు సిపి సివి ఆనంద్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఇక ఈ కేసు దర్యాప్తులో బిజెపి జాతీయ నేతల ప్రమేయం ఉందని నిందితుల కాల్ డేటా, వాట్సాప్ సందేశాలు ఆధారంగా గుర్తించిన సిట్ అధికారులు అనుమానితులను విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు.
ఆ ముగ్గురి అరెస్ట్ కోసం.. కోర్టులో వారెంట్ కోసం సిట్ ప్రయత్నం
బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ కు, కేరళకు చెందిన తుషార్, జగ్గు స్వామిలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన వారు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక బి ఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు సహకరించ లేదని సిట్ పోలీసులు హై కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక కేరళ రాష్ట్రానికి చెందిన తుషార్, జగ్గు స్వామి విషయంలోనూ సిట్ కు చుక్కెదురైంది. రాకపోతే అరెస్టు చేస్తామని నోటీసుల్లో ప్రకటించినప్పటికీ, సిట్ ప్రకటనను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో న్యాయ నిపుణులను సంప్రదించి తదుపరి చర్యలకు రంగంలోకి దిగుతామని చెప్పారు సిట్ అధికారులు. కోర్టు దృష్టికి తీసుకు వెళ్లి వారెంట్లు జారీ చేయించుకుని అరెస్టు చేసే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది.
సిట్ ముందుకు వెళ్ళాలంటే ఇతర రాష్ట్రాల సహకారం అవసరం
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉంటే సిట్ అధికారులకు పెద్ద ఇబ్బంది వచ్చేది కాదు. కానీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉండటంతో సిట్ ముందుకు వెళ్లడంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అరెస్టయిన నిందితులను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండగా అరెస్టు చేశారు. ఇప్పటి వరకు విచారణ జరిపిన వారు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులను విచారించాలని సిట్ బలంగా భావిస్తున్నప్పటికీ ఇతర రాష్ట్రాల సహకారం లభిస్తే తప్ప తెలంగాణ పోలీసులు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది.
వారికి బలమైన రాజకీయ అండ.. సిట్ అరెస్ట్ సాధ్యం కాదని చర్చ
సిట్ నోటీసులు జారీ చేసిన ముగ్గురు బలమైన శక్తుల అండ ఉన్న వారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో వీరిని అరెస్ట్ చేయాలని పట్టుదలతో ఉన్న సిట్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి వారిని అరెస్టు చేసి తీసుకు రాగలుగుతుందా అన్నది ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్న అనుమానం. సిట్ కు దేశంలో ఎక్కడికైనా వెళ్లి అరెస్టు చేసే అధికారం ఉందా అన్నది కూడా స్థానికంగా జరుగుతున్న చర్చ. అయితే ఇంతకు ముందే ఈ కేసుకు సంబంధించి సిట్ హై కోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు వారిని అరెస్ట్ చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. కానీ అది అంత సాధ్యం కాదు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
వారిని అరెస్ట్ చేసి విచారిస్తుందా? లేకుంటే దర్యాప్తు ముందుకు సాగేదేలా?
ఢిల్లీలో ఉండే బి ఎల్ సంతోష్ బిజెపి అగ్రనేత కావడంతో ఆయన అరెస్టు అంత ఈజీ కాదని తెలుస్తుంది. ఢిల్లీలో అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పటికీ, పోలీసు యంత్రాంగం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి బి యల్ సంతోష్ అరెస్ట్ తెలంగాణ సిట్ కు కత్తి మీద సామే నని చెప్పాలి. ఇక కేరళలోనూ తుషార్, జగ్గు స్వామి ఇద్దరూ ప్రభుత్వ పెద్దలకు కావలసిన వ్యక్తులు. ఈ క్రమంలో వారి అరెస్టుకు అక్కడి ప్రభుత్వం సహకరించే పరిస్థితి ఉండబోదు. దీంతో ఈ కేసులో సిట్ ముందుకు వెళ్లాలంటే ఏం చేయబోతుంది అన్నది తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వీరి అరెస్టు సాధ్యం కాకపోతే, వీరు విచారణకు రాకపోతే సిట్ దర్యాప్తు ముందుకు ఎలా సాగుతుంది అన్నది కూడా ప్రశ్నార్థకమే.