వాళ్ళసలు తెలంగాణా బిడ్డలేనా? తెలంగాణా బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వరి ధాన్యం కొనుగోలు విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటానికి సీఎం కేసీఆర్ కేంద్రంపై సమరం సాగించటానికి రెడీ అయ్యారు. ఇక ఇదే సమయంలో బీజేపీ నేతలు కూడా ఎదురు దాడి చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు.

తెలంగాణా బీజేపీ నాయకుల తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
తాజాగా వరి ధాన్యం కొనుగోలు అంశంపై బిజెపి నాయకులు తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వైఖరి చూస్తుంటే వాళ్ళసలు తెలంగాణ బిడ్డలేనా అని అనిపిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే విధానం ఉండాలని పేర్కొన్న కవిత, తెలంగాణ రైతుల పక్షాన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
పంజాబ్, హర్యానాలకు ఒక న్యాయం .. మాకో న్యాయమా : కవిత
కేంద్ర ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని మండిపడిన కవిత పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఒక నీతి వేరే రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని విమర్శలు గుప్పించారు. పంజాబ్లో కొనుగోలు చేసినట్లు తెలంగాణ రాష్ట్రంలోని వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణాకు కేంద్రం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని వెంటనే రూపొందించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై తెలంగాణా సర్కార్ సమరం
ఇదిలా ఉంటే ఎన్డిఎ ప్రభుత్వంపై తన దాడిని మరింత ఉధృతం చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులతో పాటు ఢిల్లీకి వెళ్లి వేసవి సీజన్లో రాష్ట్రంలో ఉత్పత్తి చేసే వరిని కేంద్రాన్ని కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకురావడానికి ప్లాన్ చేశారు. మార్చి 21వ తేదీన టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ ముఖ్యులతో రాష్ట్రంలో 'యాసంగి' (వేసవి పంట) వరిని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ధర్నాలు, ఇతర నిరసనలు నిర్వహించాలని సూచించారు.

వరి వార్ ... పేలుతున్న మాటల తూటాలు
ముందు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్న కెసిఆర్ ఈ మేరకు మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపించారు. మంత్రుల బృందం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయి యాసంగి వరి సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్రం ధాన్యం సేకరణకు అంగీకారం తెలపకుంటే తెలంగాణలో ఆందోళనలు చేపట్టాలని సూచించారు. దానికి అనుగుణంగా టీఆర్ఎస్ సభ్యులు లోక్సభ, రాజ్యసభల్లో నిరసనలు తెలుపుతారని ఆ ప్రకటనలో తెలిపారు. కేంద్రం పంజాబ్ నుంచి 100 శాతం వరి ధాన్యాన్ని సేకరిస్తున్నదని పేర్కొంటూ, తెలంగాణ నుంచి 100 శాతం వరిధాన్యాన్ని సేకరించాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సిఐ)ని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా అధికార ప్రతిపక్ష పార్టీలు మరోమారు వరి వార్ కు సిద్ధమయ్యాయి. ఈ నేపధ్యంలోనే మాటల తూటాలు పేలుతున్నాయి.












Click it and Unblock the Notifications