ఉద్యమం చేసి వచ్చాం - భయపడే వాళ్లం కాదు : ఎమ్మెల్సీ కవిత..!!
ఈడీ ముందు విచారణకు హాజరవుతానని..పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేసారు.
ఈడీ ముందు విచారణకు హాజరవుతానని..పూర్తిగా సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేసారు. ఈడీ నోటీసుల తరువాత ఢిల్లీ వచ్చిన కవిత రేపు (శుక్రవారం) నిర్వహించనున్న దీక్ష గురించి వివరించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం తాను దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మోదీ కంటే ముందుగానే ఈడీ వస్తోందన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో తొమ్మది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని ఆరోపించారు. తెలంగాణలో తాము ఆ ప్రయత్నాలను అడ్డుకున్నామని..దీంతో, ఇప్పుడు విచారణ సంస్థలను ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలను విచారించే విషయంలో చట్టంలో పేర్కొన్న అంశాలు అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు.

మహిళా రిజర్వేషన్ల కోసం రేపు దీక్ష
మహిళా బిల్లు కోసం ఢిల్లీ వేదికగా దీక్ష చేయాలని తాను గతంలోనే నిర్ణయించానని కవిత పేర్కొన్నారు. ఈ బిల్లు కోసం 27 ఏళ్లుగా చర్చ జరుగుతోందన్నారు. పార్టీల కోసం కాదని..మహిళల కోసం బిల్లు తేవాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోవటం లేదని ఆక్షేపించారు. రాజ్యసభళో బిల్లు తెచ్చినందుకు సోనియా గాంధీకి ఎమ్మెల్యే కవిత ధన్యవాదాలు చెప్పారు. అప్పటి నుంచి మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. 2014,2019 ఎన్నికల్లో బీజేపీ కూడా మహిళా బిల్లు పైన హామీ ఇచ్చిందని గుర్తు చేసారు. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల కారణంగా బిల్లు ఆమోదం పొందలేదని..ఇప్పుడు బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందని చెప్పుకొచ్చారు. మన దేశంలో చట్ట సభల్లో మహిళలకు 14 శాతం కూడా ప్రాధాన్యత దక్కటం లేదన్నారు.

విచారణకు హాజరవుతా..సహకరిస్తా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనకు ఈడీ నోటీసులు ఇచ్చాయని కవిత చెప్పారు. మరుసటి రోజునే విచారణకు రావాలని సూచించారన్నారు. తాను ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా 16న విచారణకు వస్తానని కోరిన విషయాన్ని వెల్లడించారు. కానీ, ఈడీ అందుకు అంగీకరించలేదని..11న విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు. గతంలో మహిళలకు అనుకూలంగా ఉన్న చోటే విచారణ చేయాలని గతంలో అనేక కోర్టు తీర్పులు ఉన్నాయని గుర్తు చేసారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా వెసులుబాటు ఇవ్వట లేదన్నారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసిందని చెప్పారు. తనతో పాటుగా ఎవరిని విచారించినా అభ్యంతరం లేదని..తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పిన విషయాన్ని వెల్లడించారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ విచారణ ఎదుర్కోలేదని..తాను విచారణ ఎదర్కోవటానికి సిద్దంగా ఉన్నానని కవిత స్పష్టం చేసారు.

ఇదంగా కక్ష సాధింపులో భాగమే..
మోదీ వన్ నేషన్.. వన్ ఫ్రెండ్ స్కీమ్ అమలు చేస్తున్నారు అని కవిత మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అవుతుందన్నారు. మహిళా బిల్లు ఆందోళన అనగానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. వంట గ్యాస్ ధరలపై మరొకరు గళమెత్తితే వాళ్లకు కూడా ఈడీ నోటీసులు ఇస్తారన్నారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారు అని కవిత ధ్వజమెత్తారు. బీజేపీలో చేరిన నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఉండవు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులు పెడుతారు. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉంది. ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం అని కవిత తేల్చిచెప్పారు. ఇదే సమయంలో కవిత రేపు (శుక్రవారం) దీక్ష చేయనున్న జంతర్ మంతర్ ప్రాంగణంలో ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు.












Click it and Unblock the Notifications