రూ.120కోట్లతో తెలంగాణా స్టేట్ క్యాన్సర్ సెంటర్గా ఎంఎన్జే ఆస్పత్రి; క్యాన్సర్పై పోరుకు మూడంచెల వ్యూహం!!
క్యాన్సర్ మహమ్మారి నుండి ప్రజలను కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి, చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నదని ఆయన వెల్లడించారు. ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించిన మారథాన్ వాక్ ను మంత్రి ఈ రోజు ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి క్యాన్సర్ వ్యాధి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక వ్యూహాలను వివరించారు.
క్యాన్సర్ కు కారణం ఇదే.. చిన్నవయసు వారికీ క్యాన్సర్ వస్తుందన్న మంత్రి హరీష్ రావు
మారిన జీవన శైలి, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా, చాలామంది చిన్నతనంలోనే రోగాల బారిన పడుతున్నారని, చిన్న వయసులోనే క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము క్యాన్సర్ విషయంలో ఇదే జరుగుతుందని అన్నారు మంత్రి. ఒకప్పుడు పెద్ద వయసులో ఉన్న వారికి మాత్రమే కనిపించే క్యాన్సర్ ఇప్పుడు ముప్పై, నలభై ఏళ్ళ వయసులో ఉన్నవారికి కూడా కనిపిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.
క్యాన్సర్ కోసం మొబైల్ స్క్రీనింగ్స్ క్యాంపులు.. రాష్ట్ర స్థాయి క్యాన్సర్ ఆస్పత్రిగా ఎంఎన్ జే ఆస్పత్రి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొబైల్ స్క్రీనింగ్ ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఎంఎన్ జె ఆసుపత్రిని రాష్ట్ర స్థాయి క్యాన్సర్ ఆసుపత్రిగా విస్తరిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. నెలకు సగటున 6 క్యాంపులు పెట్టి, దాదాపు 8 వందల మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి అని, క్యాన్సర్ చికిత్స పై రాష్ట్రం ఇంతవరకు 750 కోట్ల రూపాయిలు ఖర్చు చేసిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
120 కోట్ల రూపాయిలతో స్టేట్ క్యాన్సర్ సెంటర్ గా ఎంఎన్ జే ఆస్పత్రి
ప్రభుత్వం అన్ని రకాల క్యాన్సర్ లకు ప్రభుత్వం సమగ్ర చికిత్స అందిస్తోందని చెప్పారు. అందులో భాగంగా, ఎంఎన్ జే ఆసుపత్రిని 120 కోట్ల రూపాయిలతో స్టేట్ క్యాన్సర్ సెంటర్ గా అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పేషెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత 450 పడకలను 750 కి పెంచుతున్నట్లు, నాలుగు ఎకరాల స్థలంలో 5 అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎంఎన్ జే ఆసుపత్రిలో, కొత్తగా 30 కోట్ల రూపాయిలతో 8 మాడ్యులర్ థియేటర్లు ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. ఇందులో ఒకటి రోబోటిక్ థియేటర్ కూడా ఉందని పేర్కొన్నారు.
క్యాన్సర్ పై పోరులో అందరూ సహకరించాలన్న మంత్రి హరీష్ రావు
కాన్సర్ వ్యాధి గురించి ఈ నెలలో విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. క్యాన్సర్ పై పోరులో ప్రభుత్వ కృషికి తోడుగా ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతుగా సహకారం అందించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.