తెలంగాణ పర్యటనకు అమిత్ షా మళ్లీ డుమ్మా..?!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంటోంది. ఈ ఏడాది తెలంగాణ సహా మరో ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది కూడా. ఫిబ్రవరి 16వ తేదీన త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల- 27వ తేదీన నాగాలాండ్, మేఘాలయాల్లో పోలింగ్ ను షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.
ఈ టర్మ్లో ఇదే చివరిది- తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు..!!
ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు- మార్చ్ 2వ తేదీన వెలువడతాయి. తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయి ఆయా రాష్ట్రాల్లో. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తొలి దశలో ఎన్నికలను ఎదుర్కొననున్న మూడు ఈశాన్య రాష్ట్రాలకు క్యూ కట్టారు.
దీని ప్రభావం- తెలంగాణలో బీజేపీ ప్రచార షెడ్యూల్ పై ప్రభావాన్ని చూపుతోంది. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 28వ తేదీన ఆయన తెలంగాణకు రావాల్సి ఉంది. ఎన్నికల ప్రచార సభలను ఆయన లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. అలాగే- పార్టీ పదాధికారులతోనూ భేటీ కావాల్సి ఉంది.
ఈ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడినట్లు చెబుతున్నారు. త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ లల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో తీరిక లేని షెడ్యూల్ ఉండటం వల్లే తెలంగాణ పర్యటన వాయిదా పడిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఫిబ్రవరి 16వ తేదీన జరుగనున్న త్రిపుర అసెంబ్లీ పోలింగ్ ముగిసిన తరువాతే అమిత్ షా తెలంగాణలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనుంది. ఫిబ్రవరి 6వ తేదీన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భద్రాచలం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. హాత్ సె హాత్ జోడో యాత్రను పూనుకుంటోన్నారు. 60 రోజుల పాటు సాగుతుందీ యాత్ర. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా- ఈ యాత్రను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.