అది నాన్న చేసిన తప్పే: బాంబు పేల్చనున్న మంచు మనోజ్- ప్రెస్ మీట్
Mohan Babu: కుటుంబంలో ఆస్తి తగాదాలను ఎదుర్కొంటోన్నారు ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు. ఆస్తి పంపకాల వ్యవహారంలో చిన్న కొడుకు మంచు మనోజ్, కోడలు భూమా మౌనిక రెడ్డితో ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవలు కాస్తా రచ్చకెక్కాయి. విభేదాలు వీధిన పడ్డాయి. అభిప్రాయభేదాలు భగ్గుమన్నాయి.
ఈ గొడవల్లో తన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్నీ మోహన్ బాబు మీడియాపై చూపించారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్కు చెందిన విలేకరి ముప్పిడి రంజిత్ కుమార్పై దాడి చేశారు. మైక్తో బలంగా కొట్టారు. ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్లో తేలింది.

ఈ దాడి నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు మంచు మనోజ్ క్షమాపణలు చెప్పారు. ఈ దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులు, మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని, వారికి అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నానని అన్నారు.
తండ్రి మోహన్ బాబు చేసిందే తప్పేనని, జర్నలిస్టులకు మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలనీ డిమాండ్ చేశారు. మంచు టౌన్ షిప్ గేట్ వద్ద కూర్చుని మీడియా ప్రతినిధులతో కలిసి ధర్నాకు దిగారు. మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
నాన్న చాలా మారిపోయారని చెప్పారు. అన్న కోసం గొడ్డులా కష్టపడుతున్నా కూడా ఏనాడూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, ఈ గొడవల మధ్య అమ్మ నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ వాపోయారు.
తన భార్య భూమా మౌనిక రెడ్డి, ఏడు నెలల కూతురిని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని, తమకు ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులకు లిఖితపూరకంగా కోరానని, అలాగే భద్రత కోసం వ్యక్తిగతంగా బౌన్సర్లను నియమించుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
ఎవరి ఆస్తి, దయాదాక్షిణ్యాల మీద తాను ఆధారపడట్లేదని, ఎవరినీ ఆస్తి గురించి అడగలేదని మంచు మనోజ్ తేల్చి చెప్పారు. తన కాళ్ల మీద తాను నిలబడుతున్నానని, ఇది జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. భార్య, కూతురి పేర్లను వివాదంలో లాగడం వల్లే తాను ఇలా స్పందించాల్సి వచ్చిందని అన్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు ప్రెస్మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానని మనోజ్ చెప్పారు.












Click it and Unblock the Notifications