మొదలైన తొలకరి జల్లులు.. తెలంగాణ, ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు!?
రుతుపవనాల రాక ఒకట్రెండు రోజులు ఆలస్యమైనప్పటికీ.. ఈసారి రెండు రాష్ట్రాల్లో వర్షాలు భారీగానే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఇప్పటికే చల్లబడింది. ఒకటి, రెండు చోట్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో సోమవారం పలు చోట్ల భారీ వర్షాలు, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడినట్లు వాతావరణశాఖ నివేదిక వెల్లడించింది.
రాబోయే రెండ్రోజుల్లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు, తీవ్రమైన గాలుల చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే ఆస్కారం ఉన్నట్లు అంచనా.
తొలకరి వర్షాలు ప్రారంభం...
తొలకరి వర్షాలు పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు మండుటెండలతో అల్లాడిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది కొంతవరకు ఉపశమనమే. ఉదయం ఎండ దంచి కొడుతున్నా సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. రాత్రి వేళల్లో వర్షం పడుతోంది. గత 24 గంటలుగా పలు చోట్ల మేఘాలు ఆవరించి ఉండటం, తొలకరి పలకరించడంతో ప్రజల్లో సంతోషం కనిపిస్తోంది.
రేపటినుంచి భారీగా...
క్యుములోనింబస్ మేఘాల కారణంగా.. తెలంగాణ, ఏపీలో రేపటి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీగా వర్షాలు కురుస్తాయని, మూడు రోజులపాటు ఈ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా మణుగూరులో 9 సెంటీమీటర్లు, పినపాకలో 8 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా నాగరెడ్డిపేట, ఎల్లారెడ్డిపేట తదితర చోట్ల 6 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.
‘నైరుతి' దోబూచులాట
ఒకసారి వేగం.. అంతలోనే మందగమనం.. ఇలా ఈ సీజన్లో నైరుతి దోబూచులాడుతోంది. తాజాగా నైరుతి రుతుపవన వ్యాప్తి మందగించింది. దీనికి కారణం - అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనమే. దీంతో నైరుతి రుతుపవనాలు మందగించాయి. ఇప్పటికే రాయలసీమలోకి ప్రవేశించి తెలంగాణ వైపుగా కదలాల్సిన నైరుతి రుతుపవనాలు.. ఇంకా కేరళ, తమిళనాడుల్లోనే నెమ్మదిగా కదులుతున్నాయి. రెండుమూడు రోజుల్లో కర్ణాటక నుంచి రాయలసీమ వరకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
‘విండ్ షియర్' ప్రభావంతో...
భూ ఉపరితలంపై అనువైన వాతావరణం లేక రుతుపవనాల విస్తరణలో జాప్యం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాస్తవానికి నైరుతి రుతుపవన వ్యాప్తికి.. గాలుల దిశ మార్పునకు(విండ్ షియర్) సంబంధం ఉంటుంది. విండ్ షియర్ బలంగా లేకుంటే రుతుపవనాల వ్యాప్తి మందగిస్తుంది. ప్రస్తుతం విండ్ షియర్ బలహీనంగా మారడంతో నైరుతి రుతుపవన వ్యాప్తిలో వేగం తగ్గింది.
మరో రెండ్రోజుల్లో...
ఈ నేపథ్యంలో రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశించేందుకు ఇంకా రెండు నుంచి మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాయలసీమలో ప్రవేశించిన ఒకట్రెండు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణకూ వ్యాపిస్తాయి. గతేడాది జూన్ 17న తెలంగాణకు రుతుపవనాలు వచ్చాయి. అయితే రుతుపవనాల రాక ఒకట్రెండు రోజులు ఆలస్యమైనప్పటికీ.. ఈసారి వర్షాలు భారీగానే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.