ఏపీ-తెలంగాణలూ నామినేట్ చేయాలి: 'పద్మ'పై నిన్న పవన్ కళ్యాణ్ పెదవి విరుపు, నేడు గాలి
అమరావతి: పద్మ అవార్డుల్లో తెలుగువారికి అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిన త్వరలో ఎన్నికలు ఉన్న కర్నాటక వంటి రాష్ట్రానికి ఎక్కువ అవార్డులు ఇచ్చారని, తెలుగు రాష్ట్రాలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని పలువురు వాపోతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు.
Recommended Video
చదవండి: చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన బీజేపీ సోము వీర్రాజు
పద్మ అవార్డులు మరికొంతమంది తెలుగువారికి రావాల్సి ఉండెనని ఆయన ఇటీవల అన్నారు. సావిత్రి, ఎస్వీ రంగారావు వంటి నటీనటులకు పద్మ అవార్డులు ఇవ్వాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కేంద్రానికి నామినేట్ చేయాల్సింది అన్నారు. పద్మ అవార్డులు సాధించిన కిడాంబి శ్రీకాంత్, ఇళయరాజాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
పద్మ అవార్డులపై అసంతృప్తి
పద్మ అవార్డులపై పవన్ కళ్యాణ్తో పాటు పలువురు తెలుగు ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుగువారికి ఈ అవార్డుల్లో ప్రాధాన్యత లేదని వాపోతున్నారు. ఏపీ తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ కూడా కేంద్రంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పీవీ, ఎన్టీఆర్లకు భారతరత్న ఏవి
గణతంత్ర దినోత్సవ వేడుకలు, పద్మ అవార్డుల విషయంలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆర్థిక సంస్కరణల ఆద్యుడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన దివంగత సీఎం ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వీరికి సరైన గుర్తింపు లేదు
బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, స్థానిక సంస్థల్లో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని గాలి తెలిపారు. నీలం సంజీవరెడ్డి, దాసరి నారాయణరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి వారికి సరైన గుర్తింపు దక్కలేదన్నారు.
కేంద్రం హామీలపై
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయడం, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కృష్ణా నీటి పంపకాల్లో అన్యాయం వంటి అంశాలపై ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కటి కావాలని విజ్ఞప్తి చేశారు.