కన్నకొడుకును చంపిన తల్లి: రైలు కింద పడి వ్యక్తి మృతి, తల మాయం
కరీంనగర్: ఓ మహిళ తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన కుమారుడినే హతమార్చింది. ఈ అమానుష ఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలం రాజారాంలో చోటుచేసుకుంది. మద్యానికి బానిపైన కొడుకు నిత్యం వేధింపులకు పాల్పడేవాడుగా సమాచారం. కొడుకు చేష్టలకు విసిగి వేసారిని తల్లి కన్నప్రేమను కూడా పక్కనపెట్టి కొడుకుని చంపింది.
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో డౌన్ట్రాక్పై గురువారం ఉదయం రైలుకిందపడి గుర్తుతెలియని(30)వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకోగా, ఘటనా స్థలం వద్ద కేవలం మొండెం మాత్రమే ఉంది.
తల ఎగిరి రైలుకు చిక్కుకుని ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు చేయి విరిగితే కట్టు కట్టించుకుని, గ్రీన్షర్టు, నేవీబ్లూ జీన్స్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్ను ఓ ఆటో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
చేతబడి నెపంతో వ్యక్తి హత్య
చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో గ్రామప్రజలు ఓ వ్యక్తిని కొట్టి చంపారు. ఈ దారుణ అమానుష ఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిన్న నిజాంపేటలో చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో వ్యక్తిని కొట్టి చంపినట్లుగా సమాచారం. వ్యక్తి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించి దర్యాప్తు చేపట్టారు.