బాబూ! ఇక నాకు దిక్కెవరు? ఐదు నిమిషాలే అడిగా!: అవమానమంటూ మోత్కుపల్లి ఆవేదన
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం నగరంోలని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన 'మహానాడు'కు తనకు ఆహ్వానం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. టీటీడీపీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపైనా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కాలం నుంచి పార్టీ కోసం పనిచస్తున్న తనను కూడా మహానాడుకు ఆహ్వానించకపోవడం ఏంటని ప్రశ్నించారు.
అదృష్టం లేదు.. పదవులు ఆశించకుండా..
‘మహానాడుకు వెళ్లే అదృష్టం నాకు లేదు. నేను 1982 నుంచి పార్టీ జెండా పట్టిన వ్యక్తిని. ఎన్టీఆర్తో కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఆయన చనిపోయేంత వరకు కూడా ఏ పదవి కూడా ఆశించకుండా పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగాను. అదే రకంగా చంద్రబాబుతో కూడా 15 సంవత్సరాల నుంచి అధికారంలో లేకపోయినా.. ఆయనకోసమే పనిచేశాను. బాబుతో కలిసి కేబినెట్ మంత్రులుగా పనిచేసిన వాళ్లంతా పరారయ్యారు' అని మోత్కుపల్లి అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ రకంగా అవమానిస్తారా?
‘నేను ఒక దళితుడ్ని. వెనుక ఏ బ్యాక్గ్రౌండ్ లేనివాడ్ని. ‘నర్సింహులు నువ్వు తోడుగా ఉండు' అనే చంద్రబాబు మాటకు నేను ఆయనకు అండగా ఉన్నాను. మీకు అండగా నిలబడిన రోజులున్నాయి.. అదే నాకు అదృష్టంగా భావిస్తాను. కానీ నన్ను ఈ రకంగా అవమానపరచడం చాలా బాధగా ఉంది' అని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
మీ ప్రేమ కావాలంటే.. ఐదు నిమిషాలే..
అంతేగాక, ‘గత మూడు సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రిని కలవడానికి టైం అడుగుతున్నాను. ఈ మాట ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు పోతుంది.. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది ఇదీ నా పరిస్థితి. అయ్యా నాకు ఏమీ అక్కర్లేదు మీ ప్రేమ కావాలంతే అని ఆయన(చంద్రబాబు)కు చెప్పాను. కేవలం ఐదే ఐదు నిమిషాల సమయం నాకివ్వలేకపోయారు' అని మోత్కుపల్లి నర్సింహులు వాపోయారు.
ఇక నాకు దిక్కెవరు బాబూ..?
‘చేతకానివాళ్లు, పనికిమాలిన వాళ్లంతా మీ పక్కన చేరుతున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసి ప్రాణ త్యాగం కోసం సిద్ధపడ్డ మమ్మల్ని పక్కన పెడుతున్నారు. లేనిపోనివన్నీ మీకు ఎవరో చెప్పి మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. పేదవాడి మనసుకలిగిన నాయకుడని నేను ఇన్ని రోజులు అనుకున్నాను, కానీ ఈ రకంగా మీరే నన్ను అవమానపరిస్తే నాకు దిక్కెవరు..? మీకోసమే నేను ఇన్ని రోజులు ఉన్నాను. అధికారమే కావాలనుకుంటే నేను టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలోకి పోయేవాడినే కదా?' అంటూ మోత్కుపల్లి తన ఆవేదనను వెళ్లగక్కారు. కాగా, మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలోనే మహానాడుకు ఆహ్వానించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.