టీఆర్ఎస్లో మోత్కుపల్లి నర్సింహులు చేరికకు ముహూర్తం ఖరారు: కీలక పదవి ఖాయమేనా?
హైదరాబాద్: సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఇటీవల భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. ఆ పార్టీ విమర్శలు గుప్పించడంతోపాటు సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సంకేతాలిచ్చారు.

అక్టోబర్ 18న టీఆర్ఎస్లోకి మోత్కుపల్లి నర్సింహులు
ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. రాష్ట్ర విభజన ముందు వరకు మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం పార్టీ(టీడీపీ)లో కీలక నేతగా కొనసాగిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాజకీయ నేతల్లో సీనియర్గా నేతగా ఉన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగిన మోత్కుపల్లి నర్సింహులు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు.

కేసీఆర్పై మోత్కుపల్లి ప్రశంసల వర్షం..
ఇటీవల కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకంపై పొగడ్తల వర్షం కురిపించారు మోత్కుపల్లి నర్సింహులు. ఈ పథకం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ను అభినవ అంబేద్కర్గా ఆకాశానికెత్తేశారు. పార్టీలకు అతీతంగా నేతలందరూ ఈ పథకం విషయంలో సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. మోత్కుపల్లి నర్సింహులు చేసిన ఈ కామెంట్స్.. ఆయన త్వరలోనే టీఆర్ఎస్లో చేరతారని సంకేతాలిచ్చాయి.

మోత్కుపల్లికి కీలక పదవి ఖాయమేనా?
కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం దళిత అంశం తెరపైకి రావడంతో మోత్కుపల్లికి కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించాయి. అదే సమయంలో మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరితే.. సీఎం కేసీఆర్ ఆయనకు కీలక పదవి ఇస్తారని వార్తలొచ్చాయి. దళితబంధు పథకానికి చట్టబద్ధత తీసుకొచ్చి.. ఆ పథకం అమలు కోసం మోత్కుపల్లిని చైర్మన్గా నియమించాలని కేసీఆర్ అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కూడా ఇస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాసలమర్రి గ్రామంలో తొలుత అమలు చేసిన కేసీఆర్ సర్కారు.. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. అయితే, హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు దళితబంధును తీసుకొచ్చాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత దళితబంధు పథకాన్ని కేసీఆర్ కొనసాగించరని ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications