హుజురాబాద్ లో ఈటలను ఓడిస్తానన్న మోత్కుపల్లి నర్సింహులు ; మునుగోడు ఎమ్మెల్యే పైన కూడా ఫైర్
ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ పార్టీలో చేరిన నేత మోత్కుపల్లి నర్సింహులు హుజురాబాద్ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ అవినీతిపరుడు అంటూ ఆరోపణలు గుప్పించారు. దళితుల భూములను కబ్జా చేసిన ఈటల రాజేందర్ ఆ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు చెందిన 40 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న బిజెపి నేత ఈటల రాజేందర్ వెంటనే భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుల భూములు తీసుకోవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు మోత్కుపల్లి నరసింహులు.
బీజేపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. దూకుడు చూపిస్తారా ?
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, ఈటల రాజేందర్ ను ఓడిస్తానని స్పష్టం చేశారు. దళిత బంధు పథకం పై విస్తృతంగా ప్రచారం చేస్తానని పేర్కొన్న ఆయన ఈటల రాజేందర్ ను ఓడించడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. రాబోయే కాలంలో దళిత బంధు పథకాన్ని అమలు చేసుకోగలిగితే దళితులు ప్రతి ఒక్కరూ బ్రతుకుతారని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. దళిత బంధు పథకం వల్ల అంబేద్కర్ ఆశయాలు నెరవేరతాయన్న మోత్కుపల్లి హుజురాబాద్ ఉప ఎన్నిక నుంచి ఈటల రాజేందర్ ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
బిజెపి నాయకులు దళిత బంధుని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దళితులు బాగుపడితే బానిసలుగా ఉండరని భావిస్తున్నారని ఆరోపించారు మోత్కుపల్లి నరసింహులు. అందుకే కుట్రలు చేస్తున్నారన్నారు. ఈటల రాజేందర్ పదవిని అడ్డం పెట్టుకుని 700 ఎకరాల భూమిని సంపాదించారని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ద్వజమెత్తారు మోత్కుపల్లి నరసింహులు. దళితుల ఆత్మగౌరవ కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని తీసుకు వస్తే అడ్డుకోవడం సరి కాదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని మోత్కుపల్లి హెచ్చరించారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగితే కనీసం డిపాజిట్ కూడా రాదన్నారు. 70 ఏళ్ల లో దళితుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించిన ఆయన , కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడైనా 10 లక్షల రూపాయలు ఇచ్చాయా అని ప్రశ్నించారు. దళితుల కడుపు కొడితే ఆ పాపం తప్పకుండా తగులుతుంది అంటూ మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.