కేసీఆర్ ఫెయిల్... త్వరలో రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్ ఎంపీలు... రాష్ట్రపతి పాలనకు డిమాండ్...
తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని... ప్రజల ఆరోగ్యాలను కాపాడని కేసీఆర్ ముఖ్యమంత్రి గా కొనసాగడానికి అనర్హుడని ఆయన ఫైర్ అయ్యారు. కమిషన్లు దండుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యం పైన కేసీఆర్కు ఏమాత్రం శ్రద్ద లేదన్నారు.
కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్కు కనిపించట్లేదా అని ప్రశ్నించిన కోమటిరెడ్డి... కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించకుండా సచివాలయం మీద సమీక్ష నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలోకి నీళ్లు వచ్చాయంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్ధమవుతోందన్నారు. ఇలాంటి సమయంలో రూ.1000 కోట్లతో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా? అని ప్రశ్నించారు.

ప్రజలు కేసీఆర్ పాలనను అసహ్యించుకుంటున్నారని.. ప్రజల ప్రాణాలను కాపాడలేని కేసీఆర్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనపై ఎవరికీ నమ్మకం లేదని... రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందని అన్నారు. కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్ ఎంపీలమంతా రాష్ట్రపతిని కలిసి... రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను నివేదిస్తామని చెప్పారు.
Recommended Video
ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేసినా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. కరోనా మందులు,ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్లో అమ్ముతున్నా చర్యలు తీసుకోవట్లేదన్నారు. దేశంలో ఇంత దుర్మార్గమైన పాలన ఏ రాష్ట్రంలో కూడా లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications