ఢిల్లీ కేంద్రంగా కోమటిరెడ్డి కొత్త గేమ్ - ఖర్గేకు కీలక నివేదిక: పార్టీని వీడటంపై క్లారిటీ..!!
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధినేత ఖర్గేతో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక సమయం నుంచి కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైపు అనుమానంగా చూడటం మొదలు పెట్టారు. వెంకటరెడ్డి సైతం తన సోదరుడి గెలుపు ఖాయమనే ధీమాతో కనిపించారు. కానీ, ఫలితం రివర్స్ అయింది. రాహుల్ తెలంగాణలో జోడో యాత్ర చేసిన వెంకటరెడ్డి కలవలేదు. పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలతో హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. తాజాగా నియమించిన కమిటీల్లోనూ వెంకటరెడ్డికి స్థానం దక్కలేదు. ఈ సమయంలో వెంకటరెడ్డి డిల్లీలో నేరుగా మల్లిఖార్జన ఖర్గేతో భేటీ అయ్యారు. ఒక నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, ఈ మీటింగ్ పైన టీపీసీసీలో ఆసక్తి కర చర్చ మొదలైంది.
మల్లిఖార్జున ఖర్గేతో వెంకటరెడ్డి భేటీ
వచ్చే ఎన్నికలకు నెల ముందు మాత్రమే తాను రాజకీయాల గురించి మాట్లాడుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మంత్రి పదవికే రాజీనామా చేసిన తనకు పార్టీ పదవులు ముఖ్యం కాదన్నారు. మునుగోడు ఫలితం వేళ పార్టీలో కొందరు నేతలకు టార్గెట్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మునుగోడు ఫలితం తరువాత నెమ్మదించారు. దూకుడు తగ్గించారు. రేవంత్ లక్ష్యంగా అడుగులు వేసిన వెంకటరెడ్డికి.. తాజాగా పార్టీ కమిటీల్లో ఎలాంటి బాధ్యతలు లేకుండా అధినాయకత్వం జలక్ ఇచ్చింది. దీని పైన వెంకటరెడ్డి తన సహజ ధోరణికి భిన్నంగా స్పందించారు. ఇప్పుడు ఢిల్లీ చేరారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో దాదాపు అరగంట సేపు భేటీ అయ్యారు.
పార్టీ వీడటం.. పరిస్థితులపై నివేదిక
ఈ మధ్య కాలంలో పార్టీని సీనియర్లు ఎందుకు వీడుతున్నారనే అంశం పైన ఖర్గేకు వెంకటరెడ్డి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. వరుసగా సీనియర్లు పార్టీలో ఉండలేకపోవటం వెనుక పార్టీని లీడ్ చేస్తున్న కొందరు ముఖ్య నేతల తీరు కారణంగా చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ వీడిన నేతలు సైతం చెప్పిన అంశాలను వెంకటరెడ్డి వివరించారు. పార్టీ పైన ప్రజల్లో ఆదరణ ఉన్నా.. నాయకత్వంలో మాత్రం లోపం ఉందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కమిటీల నియామక విషయంలోనూ వస్తున్న స్పందనలను ఖర్గేకు వివరించినట్లు సమాచారం. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నా.. ఉప ఎన్నికల్లో పార్టీకి సామర్ధ్యం తగినట్లుగా వ్యూహాలు లేవని ఖర్గేకు వెంకటరెడ్డి నివేదించినట్లుగా పార్టీ నేతల సమాచారం. అయితే, ఖర్గే మొత్తం వెంకటరెడ్డి ఇచ్చిన సమాచారం సేకరించటంతో పాటుగా కొన్ని అంశాల పైన ఆరా తీసారని తెలుస్తోంది. వెంటకరెడ్డి పార్టీకి ఏ విధంగా సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నారని ఖర్గే ప్రశ్నించినట్లు సమాచారం.
ఢిల్లీలో రేవంత్ హవాకు చెక్ పెడతారా
ఇప్పుడు పార్టీలో రేవంత్ నిర్ణయాలకు ఢిల్లీ కేంద్రంగా హైకమాండ్ పెద్దలు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా నియిమించిన కమిటీల్లోనూ ఇదే అంశం స్పష్టమైంది. దీంతో, నేరుగా ఏఐసీసీ పెద్దల నుంచే పార్టీలో తన స్థానం సుస్ధిరం చేసుకోవాలని వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఏ పదవి ఇవ్వకపోవటం ద్వారా వెంకటరెడ్డి పైన కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహంతో ఉందనే సంకేతాలు ఇవ్వటంలో వెంకటరెడ్డి వ్యతిరేక వర్గం సక్సెస్ అయింది. ఇప్పుడు ఏఐసీసీలో తనకు ఉన్న పట్టు నిరూపించుకుంటూ.. పార్టీలో మరోసారి తన సత్తా చాటాలనేది వెంకటరెడ్డి వ్యూహం. దీని కోసం ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కోమటిరెడ్డి కొత్త అడుగులు వేస్తున్నారు. దీంతో, రానున్న రోజుల్లో కోమటిరెడ్డి వర్సస్ రేవంత్ మద్దతు శిబిరం మధ్య కొత్త రాజకీయం చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.