కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనం - మునుగోడులో కాంగ్రెస్ గెలవలేదు..!!
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉంటూ మునుగోడులో పార్టీకి ప్రచారం చేయటం లేదనే విమర్శల నడుమ కీలక నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ఆయన కోసం వెంకటరెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు. తాజాగా తన తమ్ముడికి ఓటు వేయాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో వైరల్ అయింది. దీని పైన కాంగ్రెస్ లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ అభిమానులతో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
అందులో తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని.. పార్టీ అధికారంలోకి వస్తుందంటూ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, ఇప్పుడు వెంకటరెడ్డి అసలు మునుగోడులో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు. తాను మునుగోడుకు వెళ్లి ప్రచారం చేసినా పదివేల ఓట్లు వస్తాయన్నారు. అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు కోట్లాడుతున్నప్పుడు ఏం చేయగలుగుతామని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీల స్థాయిలో డబ్బులు పెట్టలేదన్నారు. పార్టీలో ఎవరు డబ్బులు పెట్టాలని ప్రశ్నించారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లొ ఉన్నానని..ఇక చాలని చెప్పుకొచ్చారు. తాను పాదయాత్ర చేద్దామనుకున్నానని , అయితే కాంగ్రెస్ లో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపుగా ఉందన్నారు. తాను వెళ్లి ప్రచారం చేసినా ఓడిపోయేదేనని చెప్పుకొచ్చారు.
ఓడిపోయే సీటుకు ప్రచారం ఎందుకని ప్రశ్నించారు. మునుగోడుకు వెళ్లి కాంగ్రెస్ కు ఓటు వేయమని చెప్పలేమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మునుగోడులో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలుస్తారని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనుగోడులో మూడు ప్రధాన పార్టీల మధ్య ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ వేర్వేరు పార్టీల్లో ఉన్నా..ఆ ఇద్దరు ఒకటేనని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.