మాట నిలబెట్టుకున్న కెసిఆర్: కష్టాలు తెలిసిన కెటిఆర్కే మున్సిపల్ శాఖ
హైదరాబాద్: ముందు చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాట నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్, ఐటిశాఖలకు మంత్రిగా ఉన్న కెటి రామారావుకు మున్సిపల్ శాఖ అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కోసం జరిగిన ప్రచారంలో మంత్రి కేటీఆర్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రతి గల్లీ తిరిగి మురికి వాడల కష్టాలు తెలుసుకున్న మంత్రి కేటీఆర్కు తన వద్ద ఉన్న మున్సిపాలిటీ శాఖను అప్పగిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ అయింది.
ఈ ఎన్నికల్లో అన్నితానై టిఆర్ఎస్ పార్టీకి 99 స్థానాలు సాధించి పెట్టిన కేటీఆర్ను మొత్తం కేబినెట్ అభినందించింది. ఈ సందర్బంగా ఆయనకు మున్సిపల్ శాఖ ఇచ్చేందుకు ఆమోదించింది. అనంతరం ఇందుకోసం ఓ ప్రత్యేక జీవోను కూడా జారీ చేసింది. మేడారం జాతర, బడ్జెట్ సమాశాలు, ఇతర అంశాలపై కేబినెట్లో చర్చించినట్లు తెలిసింది.