మునుగోడు ఉపఎన్నికకు రెడీ: ప్రధాన ఎన్నికల అధికారి వార్నింగ్, భారీగా నగదు సీజ్
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో పార్టీల ప్రచారహోరుతో మారుమోగిన మునుగోడు నియోజకవర్గం సైలెంట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల అధికారి వికార్ రాజ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నేటి సాయంత్రం 6 గంటలతో ప్రచార సమయం ముగిసిందని తెలిపారు.
ఇక ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలలో కూడా ప్రచారం నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు. బల్క్ మెసేజ్లు, ఫోన్ ద్వారా ఆటోమేటెడ్ క్యాంపెయిన్ చేయడంపై నిషేధం విధించినట్లు వికాస్ తెలిపారు. మోడల్ కోడ్ను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
మునుగోడు ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని వికార్ రాజ్ తెలిపారు. క్విక్ రెస్పాన్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, సెక్టార్ టీంలు, పోలింగ్ స్టేషన్ల భద్రతను పర్యవేక్షించడానికి, నిర్ధారించడానికి వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. మునుగోడు నియోజకవర్గ ఓటర్లు కాకుండా అనధికార వ్యక్తలందరూ సాయంత్రం 6 గంటల తర్వాత మునుగోడులో ఉండొద్దని తేల్చి చెప్పారు.
మునుగోడు నియోజకవర్గంలో బయటి వ్యక్తుల సంఖ్యను అరికట్టేందుకు 45 పోలీసు బృందాలు, 37 రెవెన్యూ బృందాలను నియమించినట్లు వికార్ రాజ్ తెలిపారు. ఈ టీంలు మంగళ, బుధవారాల్లో నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించి అనధికార వ్యక్తుల ప్రక్షాళనతోపాటు నగదు పంపిణీ, ఇతర ప్రేరణలను పర్యవేక్షిస్తాయని వివరించారు. జిల్లా ఎన్నికల అధికారితో సమీక్ష నిర్వహించి పంపిణీ కేంద్రం, పోలింగ్ కేంద్రాల వద్ద కల్పించిన సౌకర్యాలు, పోలీసు బందోబస్తు వంటి అంశాలను సీఈవో పరిశీలించారు. కాగా, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
కాగా, నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. 6న ఫలితాలు వెలువడనున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విస్తృత ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. నేటి వరకు ప్రశాంతంగా సాగిన ప్రచారం.. నేడు మాత్రం పలివెలలో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తంగా మారింది. కర్రలు, రాళ్ల దాడిలో ఇరువైపులా పలువురు గాయపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వాహనశ్రేణిలోని వాహనాలు ధ్వంసమయ్యాయి.
రూ. 90 లక్షలకుపైగా నగదు, మద్యం సీజ్
మునుగోడు ఉపఎన్నిక వేళ డబ్బు, మద్యం పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. తాజాగా, టీఆర్ఎస్ నేత వెంకట్రెడ్డి ఇంట్లో సీఆర్పీఎఫ్ పోలీసుల తనిఖీలు నిర్వహించగా.. మద్యం, గోడ గడియరాలు, కూల్డ్రింక్స్, పార్టీ గొడుగులు స్వాధీనం చేసుకున్నారు. తూప్రాన్ చెక్పోస్టు వద్ద ఓ కారులో తరలిస్తున్న రూ.93.99 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇప్పటి వరకు రూ. 6 కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో సోమవారం తెలిపారు.