మునుగోడు సమరం.. హేమాహేమీల ప్రచారంతో రంజుగా రాజకీయం; అక్టోబర్17 నుండి బండి సంజయ్ ప్రచారం!!
మునుగోడు ఉప ఎన్నిక పోరు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆసక్తికరంగా మారింది. దేశంలోని ఇతర పార్టీల దృష్టికి కూడా కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాత జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికపై ప్రధానంగా నెలకొంది. మునుగోడు ఉపఎన్నికలో కెసిఆర్ ను ఓడించి, మునుగోడుపై కాషాయ జెండా ఎగురవేసి, బలంగా దెబ్బ కొట్టాలని, తద్వారా కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీకి, జాతీయ రాజకీయాలకు చెక్ పెట్టాలని బిజెపి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికను బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

5అంచెల వ్యూహంతో ఎన్నికల ప్రచారంలో బీజేపీ
ఇప్పటికే 5 అంచెల వ్యూహంతో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని పక్కా ప్లాన్ తో నిర్వహిస్తోంది. మొదట ఎన్నికల నిర్వహణకు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, మండలస్థాయి, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, ఆపై బూత్ లెవల్ కమిటీలను, పన్నా ప్రముఖ్ లను నియమించి ఉపఎన్నిక బరిలోకి దిగింది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రముఖమైన నాయకులందరూ మునుగోడు లో పాగా వేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రఘునందన్ రావు, వివేక్ వెంకట స్వామి, ఈటల రాజేందర్ తదితరులు మునుగోడులో మకాం వేశారు.జీవితా రాజశేఖర్ కూడా రంగంలోకి దిగనున్నారు.

అక్టోబర్ 17 నుండి మునుగోడు ప్రచారానికి బండి సంజయ్
నిన్న మునుగోడు ఉప ఎన్నికలకు బిజెపి తరఫున రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో బిజెపి రాష్ట్ర సారధి బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడులో ఈనెల 17వ తేదీ నుండి ప్రచారం నిర్వహిస్తారని బిజెపి స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక వెంకటస్వామి తెలిపారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్న ఆయన తెలంగాణ రాజపక్స కెసిఆర్ అంటూ విమర్శించారు.

మునుగోడులో హుజురాబాద్ తీర్పు ఇవ్వాలని కోరుతున్న బీజేపీ నాయకులు
బండి సంజయ్ కూడా ఎన్నికల బరిలోకి దిగి ప్రచారాన్ని నిర్వహించనుండటంతో బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది. మునుగోడు ఉప ఎన్నికలలో ఎలాగైనా విజయాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ బహుముఖ వ్యూహంతో ముందుకు వెళుతుంది. ప్రత్యర్ధి పార్టీల వైఫల్యాలపై ప్రచారాన్ని నిర్వహిస్తూనే, బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డిపై సానుకూల దృక్పథాన్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నేతలు. హుజురాబాద్ తరహాలో, మునుగోడులో కూడా ఓటర్లు సంచలన తీర్పు ఇవ్వాలని, తద్వారా కెసిఆర్ కు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

హేమాహేమాలు ప్రచారంలోకి దిగటంతో రంజుగా మారుతున్న రాజకీయం
నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి, వారి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దిగి ప్రచారాన్ని నిర్వహిస్తుంటే, తామేమీ తక్కువ కాకుండా గులాబీ నేతలకు దీటుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా త్వరలోనే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననుండటంతో మాటల యుద్ధం మరింత హీట్ పుట్టిస్తుందని చెప్తున్నారు. రాజకీయం రంజుగా మారుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications