కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్యగా మునుగోడు ఉపఎన్నిక.. రేసులో ఆశావహులు; గెలిస్తే లెక్క వేరేగా!!
కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యంగా మారింది. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనుండగా, అంతకు ముందు జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కీలకంగా మారింది. బిజెపి మునుగోడులో కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడుతుంటే, మునుగోడు స్థానాన్ని కైవసం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి తిరుగు ఉండదు అని టిఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది.

కాంగ్రెస్ కు మునుగోడులో గెలుపు కీలకం
బిజెపి, టిఆర్ఎస్ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి మునుగోడును చేజిక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుంది అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట. గతంలో టిఆర్ఎస్ ప్రభంజనం ఉన్న సమయంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ రాజకీయాలను శాసించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే గా కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మళ్లీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తుంది.

కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు నియోజకవర్గంలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా తయారైంది. కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలు ఉన్న జిల్లా కావడంతో, అలాగే అది కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో ఈసారి ఎలాగైనా ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని అధిష్టానం రాష్ట్రస్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లకు ఎన్నిక బాధ్యతను కాంగ్రెస్ పార్టీ అప్పగించింది.

వచ్చే ఎన్నికలపై మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం
తాజాగా ఏర్పాటవుతున్న గట్టుప్పల్ మండలం సహా మొత్తం ఏడు మండలాలలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంగా ఉందని నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎన్నికల బరిలోకి దింపే అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ స్థానం చేజిక్కించుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జిల్లా మీద పట్టు తగ్గకుండా ఉంటుందని, వచ్చే ఎన్నికల పై దీని ప్రభావం తప్పకుండా ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపును కీలకంగా భావించి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

కాంగ్రెస్ లో టికెట్ కోసం ఆశావహులు..
ఇక మునుగోడు నియోజకవర్గంలో రానున్న ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుండే ఆశావహులు టికెట్ కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మునుగోడుకు ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు టిక్కెట్ రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ ఎన్నికలలో విజయం సాధిస్తేనే కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిలుపుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ పరాజయం పాలైతే పార్టీ వచ్చే ఎన్నికలలో మరింత బలహీనంగా మారే ప్రమాదం లేకపోలేదు. మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి రేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం పై హస్తం పట్టు తప్పకుండా ఏం చేస్తారో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications