ఏపీ బాటలో తెలంగాణాలోనూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్లు; కేసీఆర్ పుట్టినరోజు నాడే!!
తెలంగాణా ప్రభుత్వం మటన్ క్యాంటీన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17వ తేదీన రాష్ట్రంలో మటన్ క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్య రక్షణకు పెద్దపీట వేసి ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి మటన్ మార్ట్ లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆరోగ్యకరమైన మాంసం విక్రయాలకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి మటన్ ఉత్పత్తుల విక్రయాలను చేయాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణా ప్రభుత్వం .

కేసీఆర్ పుట్టినరోజు నాడే మటన్ క్యాంటీన్ ల ప్రారంభం
తెలంగాణా ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చెయ్యాలని తీసుకున్న నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీన రాష్ట్రంలో మటన్ క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్ లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మొదట హైదరాబాద్ లో ఈ మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనుండగా, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మాసబ్ ట్యాంకు వద్ద తొలి క్యాంటీన్..
తక్కువ ధరలకు నాణ్యమైన మాంసాన్ని విక్రయించడానికి, మాంసం వినియోగాన్ని ప్రజలలో పెంచడానికి వీలుగా మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, తొలి క్యాంటీన్ మాసబ్ ట్యాంకు వద్ద ఈనెల 17వ తేదీన ప్రారంభించనుంది. మాంసాన్ని, మాంసంతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులను ఈ క్యాంటీన్లో విక్రయించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఇక గొర్రెల పెంపకం దారుల మాంసం ఉత్పత్తిని మార్కెటింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మాంసం ఉత్పత్తులు పెంచటానికి, మార్కెటింగ్ చెయ్యటానికి మటన్ క్యాంటీన్లు
మాంసం ఉత్పత్తులను మరింత పెంచడానికి, మాంసాన్ని మార్కెటింగ్ చేయడానికి మటన్ క్యాంటీన్లు ఎంతగానో దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. మటన్ కాంటీన్లతో పాటుగా, సంచార మాంస విక్రయశాలలను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం మటన్ క్యాంటీన్ల ద్వారా, సంచార విక్రయశాలల ద్వారా నాణ్యమైన మాంసాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించనుంది. ఇటీవల గొర్రెల మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.

ఏపీలో రెండేళ్ళ క్రితమే ప్రభుత్వ మటన్ మార్ట్ లు.. తెలంగాణాలో ఇప్పుడు
మటన్ కాంటీన్ ల ఏర్పాటుకు ఆమోదం తెలిపి, గొర్రెలు మేకల పెంపకం దారులకు పెన్షన్ కల్పించడంతోపాటుగా పశువులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక పశువుల కోసం ప్రత్యేక అంబులెన్సులు తీసుకొచ్చినట్టు తెలిపిన గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ గొర్రెలు ప్రమాదవశాత్తు చనిపోతే ఎక్స్గ్రేషియా కూడా అందిస్తున్నట్టుగా పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే మటన్ క్యాంటీన్ల ద్వారా గొర్రెలు, మేకలు పెంపకం దారులకు చేయూతనివ్వనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండేళ్ల క్రితం మొదలైన ఈ విధానం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.












Click it and Unblock the Notifications