మా ఆయన పెద్ద సైకో అంటూ లేఖ: హెడ్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
మంచిర్యాల: కట్టుకున్న భార్యను ప్రాణంగా ప్రేమించాల్సిన భర్త ఆమెను అనుమానిస్తూ నిత్యం వేధింపులకు గురిచేశాడు. ఆయనొక బాధ్యత గల పోలీసు వృత్తిలో ఉండి కూడా తన భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. అతని వేధింపులు భరించలేక చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ నాగార్జునకాలో చోటు చేసుకుంది.
15 ఏళ్ల క్రితం కిష్టయ్యతో వనిత పెళ్లి
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూరు మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఆకుదారి కిష్టయ్యకు.. నస్పూర్ కు చెందిన వనిత(35)తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి పోలీస్ స్టేషన్లో కిష్టయ్య హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కిష్టయ్య కుటుంబంతో నాగార్జునకాలనీ సింగరేణి క్వార్టర్స్లో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
మానసిక వేధింపులతో వనిత ఆత్మహత్య
అయితే, గత కొన్నేళ్లుగా వనితను అనుమానించడంతోపాటు వేధించడం మొదలుపెట్టాడు కిష్టయ్య. ఇక అతని వేధింపులు భరించలేక సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె ఉరివేసుకుని కనిపించడంతో ఇరుగుపొరుగువారికి చెప్పి అక్కడ్నుంచి పరారయ్యాడు కిష్టయ్య. ఈ విషయం తెలుసుకున్న వనతి తల్లితండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విగతజీవిగా కూతురును చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
అనుమానం తప్ప, ప్రేమ లేదంటూ వనిత సూసైడ్ నోట్
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా, వనిత ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసిపెట్టింది. తనను తన భర్త మానసికంగా వేధించాడని పేర్కొంటూ తల్లిదండ్రులు, పిల్లలను ఉద్దేశించి వనిత రాసిన లేఖ అందర్నీ కంటతడి పెట్టించింది. 'నా భర్త కిష్టయ్య పెద్ద సైకో. ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. ఇంట్లోనుంచి బయటకు వెళ్తే అనుమానించేవాడు. అతని వేధింపులతో మానసిక క్షోభకు గురయ్యాను. అందుకే చనిపోతున్నా' అని వనిత పేర్కొంది. తల్లిదండ్రులు, పిల్లలకు క్షమాపణలు చెప్పింది. తన పిల్లలను భర్తకు అప్పగించవద్దని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని తన తల్లిదండ్రులను లేఖలో కోరింద వనిత.