సాగర్ ఉపఎన్నిక : నేడే హాలియాలో కేసీఆర్ బహిరంగ సభ... 'పెద్దలు జానారెడ్డి'పై డైరెక్ట్ ఎటాక్ చేస్తారా?
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచార పర్వం తుది అంకానికి చేరింది. క్లైమాక్స్లో గులాబీ బాస్ కేసీఆర్ సాగర్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. బుధవారం(ఏప్రిల్ 14) హాలియాలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే... రెండు నెలల క్రితం హాలియాలో బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్... ఇప్పుడు మరోసారి అక్కడి బహిరంగ సభలో పాల్గొనబోతుండటం గమనార్హం. తాజా సభలో కేసీఆర్ సాగర్ ప్రజలపై మరింత వరాల జల్లు కురిపిస్తారా... కొత్త హామీలు ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది.
బహిరంగ సభ ఏర్పాట్లు...
హాలియా పట్టణ శివారులోని పెద్దవూర మార్గంలో భారీ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. సభ కోసం సుమారు లక్ష మంది జనాభాను సమీకరించనున్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సభ నిర్వహించనున్నారు. సభకు తరలివచ్చే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. 20 ఎకరాల స్థలంలో సభ కోసం ఏర్పాట్లు చేశారు. దాదాపు 30 ఎకరాలు వాహనాల పార్కింగ్ కోసమే కేటాయించారు.
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆ ఇద్దరు...
ఇప్పటికే పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు సాగర్లో మకాం వేసి గ్రౌండ్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. జన సమీకరణ బాధ్యతలు కూడా ఆ నేతలే తీసుకున్నట్లు తెలుస్తోంది. తాము ఇన్చార్జిలుగా ఉన్న ప్రాంతాల నుంచి ఆయా నేతలు సభకు భారీగా జనాన్ని తరలించనున్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ పలువురు ఎమ్మెల్యేలు జనసమీకరణపై ఫోకస్ చేశారు.
ఈసారి అప్రమత్తంగా టీఆర్ఎస్...
గతేడాది జరిగిన దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. నిజానికి దుబ్బాకలో టీఆర్ఎస్ అతివిశ్వాసమే కొంపముంచిందన్న వాదన ఉంది. దుబ్బాక ఉపఎన్నిక బాధ్యతలు మొత్తం మంత్రి హరీశ్ రావుకే అప్పగించిన గులాబీ బాస్.. అటువైపు కన్నెత్తయినా చూడలేదు. మంత్రి కేటీఆర్ సహా మిగతా నేతలెవరూ అక్కడ ప్రచారం చేయలేదు. ఈ నేపథ్యంలో సాగర్ ఉపఎన్నిక విషయంలో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. అలసత్వానికి తావు లేకుండా సర్వశక్తులు ఒడ్డుతోంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ మోహరించిన మంత్రులు,ఎమ్మెల్యేలు ఓటర్లను టీఆర్ఎస్ వైపు తిప్పే పనిలో నిమగ్నమయ్యారు.
'పెద్దలు జానారెడ్డి'పై డైరెక్ట్ ఎటాక్ చేస్తారా..?
సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ 'పెద్దలు జానారెడ్డి గారు..' అని ఆయన్ను సంబోధిస్తుంటారు. ఈ దఫా ఆయన అసెంబ్లీలో లేరు కాబట్టి ఆ మాట వినిపించట్లేదు. తాజాగా హాలియా బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్... జానారెడ్డిపై డైరెక్ట్ ఎటాక్ చేస్తారా... లేక కేవలం టీఆర్ఎస్ సంక్షేమ,అభివృద్ది మంత్రాన్ని మాత్రమే ప్రస్తావిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ 'పెద్దలు జానారెడ్డి...' అని గౌరవంగా పిలిచే కేసీఆర్... హాలియా సభలో తనదైన శైలిలో విమర్శలు గుప్పించే అవకాశం కూడా లేకపోలేదు. సాగర్ బరిలో కాంగ్రెస్ పార్టీనే తమకు ప్రధాన పోటీదారుగా టీఆర్ఎస్ భావిస్తోంది. కాబట్టి హాలియా సభలో కాంగ్రెస్ టార్గెట్గానే కేసీఆర్ స్పీచ్ ఉండే అవకాశం ఉంది.