9నెలల చిన్నారి దేహం ఛిద్రం, 4సార్లు ఉత్తమ డ్రైవర్: నల్గొండ ప్రమాదం (పిక్చర్స్)
నల్గొండ: జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న ప్రమాదంలో తొమ్మిది నెలల చిన్నారి సహా మొత్తం పదిమంది మృత్యువాత పడ్డారు. మరో 22 మంది గాయపడ్డారు. వీరిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం తీవ్రతకు బస్సు డ్రైవర్ సహా కుడివైపు కూర్చున్న వారి దేహాలు ఛిద్రమయ్యాయి. బస్సు కింద పడిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు భువనగిరిలో బయలు దేరింది. 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్కట్పల్లి చేరుకోవాల్సి ఉంది.
నాగిరెడ్డిపల్లి, టేకులసోమారం, వలిగొండ, ఇంద్రపాలనగరం స్టాపుల వద్ద కొంతమంది ప్రయాణికులు దిగారు. చివరగా ఇంద్రపాలనగరం స్టాప్ నుంచి బయలుదేరిన బస్సు సుమారు అరకిలోమీటరు ప్రయాణించిన తర్వాత నిదానపల్లి రోడ్డు వద్ద కుడివైపునకు తిరుగుతున్న సమయంలో... ఈ ఊహించని పరిణామం జరిగింది.
కాగా, ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ యాస మల్లారెడ్డి (46)కి మంచి డ్రైవర్గా గుర్తింపు ఉంది. వ్యక్తిగతంగానూ సౌమ్యుడు. మల్లారెడ్డి నార్కట్పల్లి డిపోలో ఉత్తమ డ్రైవర్గా నాలుగు సార్లు అవార్డు దక్కించుకున్నారు. ఎంతో చాకచక్యంగా స్టీరింగ్ తిప్పే మల్లారెడ్డి కుడి చేయి ప్రమాదంలో తెగిపోయింది.

నల్గొండ ప్రమాదం
అందరితో స్నేహపూర్వకంగా మెదిలే బస్సు డ్రైవర్ మల్లారెడ్డి ఇలా అర్ధాంతరంగా మరణించడం ఒహించుకోలేక పోతున్నామని డిపోలో కండక్టర్గా పని చేస్తున్న మదనాచారి విచారం వ్యక్తం చేశారు. ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ ఒక్క ఉదుటున మలుపు తిరుగుతున్న బస్సును కుడివైపున బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత కూడా వేగం అదుపులోకి రాకపోవడంతో బస్సు కుడివైపు రేకులను చీల్చుకుంటూ ముందుకు వెళ్లింది. అనంతరం అదుపు తప్పి కిందపడింది.

నల్గొండ ప్రమాదం
లారీ ఢీకొట్టగానే బస్సు డ్రైవర్ యాస మల్లారెడ్డి (46) కుడిచెయ్యి భుజం వరకూ తెగిపోయి కింద పడింది. క్షణాల్లో బస్సు ఎడమవైపునకు పడిపోయింది. కుడివైపు నుంచి లారీ దూసుకెళ్లటంతో బస్సులో అటువైపు కూర్చున్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది అటువైపు కూర్చున్నవారే.

నల్గొండ ప్రమాదం
హర్యానా రిజిస్ట్రేషన్ (హెచ్.ఆర్.38-ఎస్.6833)తో ఉన్న ఎనిమిది చక్రాల లారీ పుస్తకాల లోడుతో భువనగిరి వైపు వెళుతోంది. లోడును టార్ఫలిన్తో కప్పి ఉంచేందుకు తాళ్లతో కట్టారు. తాళ్లు కట్టేందుకు వీలుగా లారీకి రెండువైపులా బలమైన కొక్కాలు ఉంటాయి. బస్సును ఢీ కొట్టగానే ఆ కొక్కాలు ప్రయాణికుల దేహాలను కూడా ఛిద్రం చేశాయి.

నల్గొండ ప్రమాదం
చనిపోయిన వారి శరీరాలల నుంచి మాంసం ముద్దలు ఎగిరిపడ్డాయంటే లారీ ఎంత వేగంగా దూసుకుపోయింతో అర్థం చేసుకోవచ్చు. తొమ్మిది నెలల బాబు బస్సు నుంచి ఎగిరి పడటంతో శరీరం బాగా నలిగిపోయింది. లారీ వేగమే ప్రమాదానికి కారణమంటున్నారు.

నల్గొండ ప్రమాదం
బస్సు పూర్తిగా ఎడమవైపు ఉంది. కుడివైపు మలుపు తిరుగుతోంది. ఎదురుగా వస్తున్న లారీ ఎడమవైపు నుంచి వెళ్లాల్సి ఉండగా పూర్తిగా కుడివైపు వచ్చి బస్సును ఢీకొట్టింది. లారీ డ్రైవర్ ఇంతలా ఎందుకు చొచ్చుకొని వచ్చాడన్నది తెలియడంలేదు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ లారీ వదిలి పరారయ్యారు. దాంతో వారు మద్యం తాగి ఉన్నారా? నిద్రమత్తులో ఉన్నారా? అన్నది తెలియడంలేదు.

నల్గొండ ప్రమాదం
ప్రమాద స్థలంలోనే తొమ్మిది మంది చనిపోగా నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఉప్పల్కు చెందిన తోట విజయలక్ష్మి (26)మృతి చెందింది. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అదనపు ఎస్పీ గంగారం, హోంమంత్రి నాయని నర్సింహా రెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేంద్ర రెడ్డిలు, విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెస్ శాసనసభాపక్షనేత జానారెడ్డి తదితరులు రామన్నపేట ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications