ప్రేమోన్మాది ఘాతుకం: కత్తితో యువతిపై విచక్షణారహితంగా దాడి, ప్లాన్ ప్రకారమే
నల్గొండ: జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తన ప్రేమను నిరాకరించిందనే నెపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు రోహిత్ అనే దుర్మార్గుడు. దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు.
బాధిత విద్యార్థిని తన స్నేహితురాలితో కలిసి ఫారెస్ట్ పార్క్కు వెళ్లింది. ఆమెను పార్క్ నుంచి పక్కకు తీసుకెళ్లిన రోహిత్ కత్తితో మెడ, కడుపుభాగం, ముఖం, కాళ్లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కొంతకాలంగా రోహిత్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాధితురాలి తండ్రి తెలిపారు. అతని ప్రేమ నిరాకరించడం వల్లే రోహిత్ తన కూతురుపై దాడి చేశాడని పోలీసులకు తెలిపారు.
ప్రేమించాలంటూ యువతిపై రోహిత్ ఒత్తిడి
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ ప్రాంతానికి చెందిన బాధిత విద్యార్థిని(21) స్థానిక ఎన్జీ కాలేజీలో ఇటీవలే బీబీఏ డిగ్రీ పూర్తి చేసింది. ఇదే కాలేజీలో నల్గొండకే చెందిన మీసాల రోహిత్(21) డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాడు. ఇతడితో విద్యార్థినిక పరిచయం ఏర్పడటంతో ఇదే అదనుగా గత కొలంగా తనను ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తడి చేస్తున్నాడు రోహిత్.
ఇష్టం లేదని చెప్పినా వినకుండా.. పార్క్కు రప్పించి
తనకు ఇష్టం లేదని యువతి పలుమార్లు తిరస్కరించడంతో ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆలోచనతో.. రోహిత్ తన స్నేహితుడైన సాయిని కలిశాడు. రోహిత్ స్నేహితుడు సాయి తన స్నేహితురాలి ద్వారా విద్యార్థినిని మంగళవారం నల్గొండ పట్టణంలోని పార్క్కు రప్పించారు. అప్పటికే అక్కడేవున్న రోహిత్ను చూసిన విద్యార్థిని.. తిరిగివెళ్దామని చెప్పింది. అయితే, కాసేపు మాట్లాడదామని ఆమెను పక్కకు తీసుకెళ్లాడు రోహిత్. మాట్లాడుతుండగానే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన రోహిత్
ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న కత్తితో రోహిత్.. ఆ యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పదిమార్లు విద్యార్థినిని పొడిచి అక్కడ్నుంచి పారిపోయాడు. దీంతో అక్కడేవున్న సాయి, మరో స్నేహితురాలు గాయపడిన విద్యార్థినిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్లాన్ ప్రకారమే యువతిపై దాడి చేశానన్న రోహిత్
కాగా, బాధితురాలి తండ్రి రామలింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపి వెల్లడించారు. నిందితుడు రోహిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై పథకం ప్రకారమే దాడి చేశానని పోలీసులకు రోహిత్ వెల్లడించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దాడికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.
గతంలో అతడితో బాధితురాలు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు సైతం బయటకు రావడంతో ఇద్దరి మధ్య ఏ విషయంపై భేదాభిప్రాయాలు వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి విషయం నిందితుడు రోహిత్ స్నేహితుడు అయిన సాయికి ముందే తెలుసా? అనే విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. రోహిత్ గత చరిత్రపైనా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.