రేవంత్పై గవర్నర్ వ్యాఖ్య, నీ నీతి సిబిఐ తేలుస్తుంది: విహెచ్, 'జానాలో పోరాటతత్వంలేదు'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని 'ధైర్యవంతుడు' అన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు మంగళవారం నాడు మండిపడ్డారు.
తన హయాంలో అత్యంత నీతివంతంగా పాలన కొనసాగిందని గవర్నర్ నరసింహన్ చెప్పడం పైనా మండిపడ్డారు. వందలాది రైతుల ఆత్మహత్యలు గవర్నర్కు కనబడటం లేదా ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును గవర్నర్ ఆదేశించలేకపోయారన్నారు.
ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డిని గవర్నర్ మెచ్చుకుకోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన పాలనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ పాలన ఎంత గొప్పగా సాగిందో సీబీఐ తేలుస్తుందన్నారు.

కాగా, తన హయాంలో అవినీతి లేదని, పనులు వేగంగా జరిగాయని, యంత్రాంగం బాగా పని చేసేలా చూశానని గవర్నర్ నరసింహన్ సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. దీనిపై విహెచ్ ఈ రోజు స్పందించారు.
జానారెడ్డికి పోరాటతత్వం లేదు: పాల్వాయి
జానారెడ్డి మంత్రిగా చేసినప్పటికీ ఆయనలో పోరాటతత్వం లేదని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగానే ఉందని తాను సోనియాకు చెప్పానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉంటే అధికారంలోకి రావడం కల్ల అన్నారు.
ప్రభుత్వం విఫలం: కిషన్ రెడ్డి
పత్తి కొనుగోలులో దశారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. పత్తి కొనుగోలులో కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.
మహారాష్ట్రలో మాదిరిగా సిసితో సమానంగా రాష్ట్ర ప్రభుత్వమే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పత్తి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.
తమ స్వలాభం కోసం అధికార పార్టీతో పొత్తు పెట్టుకోవడం అలవాటేనని మజ్లిస్ పార్టీ పైన మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీతో పొత్తు ఉండదని టీఆర్ఎస్ చెప్పడం పచ్చి అబద్దమని వ్యాఖ్యానించారు. మజ్లిస్ పార్టీతో పొత్తు టీఆర్ఎస్కు కూడా మంచిది కాదన్నారు.












Click it and Unblock the Notifications