నరేంద్రమోడీ బలంగా ఉండాలి.. రాష్ట్రాలు బలహీనంగా ఉండాలా?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దేశంలో నిరంకుశ పోకడలు పెరిగాయి.. అధికారాలన్నీ ఒకచోటే కేంద్రీకృతమవుతున్నాయి..సమాఖ్య స్ఫూర్తికి అర్థం లేకుండా పోతోంది.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కాలరాసేలా దేశంలో వాతావరణం ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపగలిగే ప్రగతిశీల ప్రత్యామ్నాయ అజెండా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సభలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరుస్తున్న కేంద్రం?
ముఖ్యంగా 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా మారుతూ వస్తున్నాయి. వీటిపై రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ కలిసి బలమైన కేంద్రం - బలహీనమైన రాష్ట్రాలు అనే ప్రాతిపదికన పనిచేస్తున్నారని కేసీఆర్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచి కేంద్రంపై ఆధారపడేలా చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా అధికారానికి లోటుండదనే భావనలో వారిద్దరూ ఉన్నారని, బీజేపీ కూడా ఉందని, అందుకే ఈ భావజాలాన్ని నిర్మూలించడానికి కేసీఆర్ కంకణబద్ధులయ్యారని రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పన్నుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఎగ్గొడుతున్నారు?
రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు గతంలో కేంద్రప్రభుత్వాలు ఏర్పాటుచేసిన పలు కమిషన్లు చేసిన సూచనలు బుట్టదాఖలయ్యాయని కేసీఆర్ అభిప్రాయంగా ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పన్నులద్వారా వసూలు చేస్తున్న ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వడంలేదు. గట్టిగా అడిగితే చిల్లర విదిల్చినట్లుగా విదిలిస్తోందనే అభిప్రాయం అన్ని రాష్ట్రాధినేతల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏమీ మాట్లాడటంలేదుకానీ ఇతర రాష్ట్రాలు మాత్రం ఈ విషయంపై కేంద్రంపై, నరేంద్రమోడీపై నిప్పులు చెరుగుతున్నారు.
రూపాయి అప్పు కూడా రానివ్వకుండా చేస్తున్నారు!!
ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వైఖరి గుదిబండలా తయారైంది. రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడంతోపాటు వాటి అవసరాలకు తగ్గట్లుగా అప్పులు తెచ్చుకునేందుకు అనుమతివ్వాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. మత ఘర్షణల పేరుతో దేశంలో రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ విద్వేష రాజకీయాల్లో ప్రజలు విలవిల్లాడుతున్నారు.
ఇదే ఒరవడి కొనసాగితే దేశ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందని, ఇప్పటికే నరేంద్రమోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని సామాజికవేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరహా పరిస్థితులను నిర్మూలించి ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా, కేంద్రం-రాష్ట్రాలు స్నేహభావంతో మెలిగేలా చేయడం, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం లేకుండా ఒకరినొకరు సహకరించుకోవడంలాంటివి ఆచరించేలా చేయడమే భారతీయ రాష్ట్ర సమితి లక్ష్యంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.