కరీంనగర్లో ఎన్ఐఏ సోదాలు: పీఎఫ్ఐతో సంబంధమున్న వ్యక్తి కోసం ఆరా
హైదరాబాద్: కరీంనగర్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారులు.. ఏఆర్ పోలీసుల బందోబస్తు మధ్య తనిఖీలు చేపట్టింది. కరీంనగర్ హుస్సేనీపురంకు చెందిన తబరేజ్ అనే వ్యక్తికి గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు ఎన్ఐఏ అధికారుల బృందం అతడి కుటుంబసభ్యులను విచారించింది. గురువారం తెల్లవారుజామున 4 గంటలకే చేరుకున్న అధికారులు.. దాదాపు 3 గంటలపాటు ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. ఇంజినీరిగ్ పూర్తి చేసిన తబరేజ్ ఎనిమిది నెలల క్రితం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.

అయితే, తబరేజ్ ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు ఎన్ఐఏ అధికారులు ప్రత్యేకంగా కరీంనగర్కు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెల్లవారుజామునే కరీంనగర్ చేరుకున్న ఎన్ఐఏ బృందం.. అనుమానిత వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేపట్టడం కలకలం సృష్టించింది. తనిఖీలు కొనసాగుతున్న ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
కాగా, పీఎఫ్ఐ తరచుగా దేశవ్యతిరేక, సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. 2012లో, కేరళ ప్రభుత్వం ఈ సంస్థ ఇండియన్ ముజాహిదీన్కు అనుబంధంగా ఉన్న నిషేధిత ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI) పునరుత్థానమని పేర్కొంది.
పీఎఫ్ఐ చేస్తున్న సంఘ వ్యతిరేక కార్యపాలను ఆపేందుకు, దీని అనుబంధ సంస్థలైన నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్ (NWF), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI)తో సహా సమాజంలోని వివిధ విభాగాలలో వివిధ శాఖలను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 సెప్టెంబర్ 22న ఐదు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం PFI 8 అనుబంధ సంస్థలకువర్తించింది.












Click it and Unblock the Notifications