కోమటిరెడ్డి కుమారుడిని రోడ్డు ప్రమాదంలో చంపాం: అదే గతి నీకు పడుతుందని వ్యాపారితో పాశం శ్రీను
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసు దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగిలోని మంచిరేవుల మూసి పరివాహక ప్రాంతంలో సోమవారం పోలీసులు ఓ అస్థి పంజరాన్ని వెలికితీశారు.
సిట్ అదుపులో ఉన్న నయీం అనుచరులు ఇచ్చిన సమాచారంతో అస్థిపంజరాన్ని రంగారెడ్డి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ అస్థిపంజరం మూడేళ్ల క్రితం నయీం నయీం చేతిలో హత్య గావించబడిన 17 ఏళ్ల నస్రీన్దిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నయీం చేతిలో హత్య చేయబడిన మరో ముగ్గురి జాడ తెలియరాలేదు. ఇప్పటి వరకు ఈ కేసులో 33 మంది నయీం అనుచరులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అదే విధంగా సుమారు రూ. 143 కోట్లకు సంబంధించిన నయీం ఆస్తులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు నయీం కేసు ప్రాథమిక దర్యాప్తు మరో మూడు రోజుల్లో పూర్తి కానుంది. ఇదిలా ఉంటే నయీంపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నయీం కేసుకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పేరు ఉండటం కలకలం రేపింది.
ఎఫ్ఐఆర్లో సిట్ అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్సీ పేరుని కూడా నమోదు చేసినట్లుగా సమాచారం. రాజ్యాంగపరమైన ఓ పదవిలో ఉన్న నల్గొండకు చెందిన ఓ ఎమ్మెల్సీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. నయీంకు భయపడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీని వ్యాపారి కలిసినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తనను ఎలాగైనా రక్షించాలంటూ ఆ వ్యాపారి ఎమ్మెల్సీని ఆశ్రయించాడు. ఫోన్ ఆన్లో పెడితే నయీం తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఎమ్మెల్సీతో తన గోడుని వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు నయీంకు భయపడి తన ఫోన్ను స్విచ్చాఫ్ కూడా చేసుకున్నాడు.
దీంతో నయీం గ్యాంగ్ స్టర్ అని అతనితో ఇష్యూ సెటిల్ చేసుకోవాలని ఆ ఎమ్మెల్సీ చెప్పాడు. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి కుమారుడికి పట్టిన గతే నీకు పడుతుందని భువనగిరికి చెందిన వ్యాపారిని పాశం శ్రీను అనే వ్యక్తి బెదిరించాడు. కోమటిరెడ్డి కుమారుడిని రోడ్డు ప్రమాదంలో చంపామని వ్యాపారితో అతడు చెప్పినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.