ఆ పారిశ్రామికవేత్తతో పెట్టుకోవడమే నయీమ్ కొంప ముంచింది
హైదరాబాద్: తెలంగాణలో అతి పెద్ద పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెట్టుకోవడమే నయీముద్దీన్ కొంప మీదికి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఆ పారిశ్రామికవేత్త తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సన్నిహితుడని సమాచారం. ఏళ్ల తరబడిదగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రహస్యంగా సంచరిస్తూ దందాలు నడుపుతూ వచ్చిన నయీమ్ చివరి నిమిషంలో ఆ పారిశ్రామికవేత్తతో పెట్టుకున్నట్లు చెబుతున్నారు.
నయీమ్ ఆ పారిశ్రామికవేత్తను 50 కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్లు చెబుతున్నారు. దాంతో ఆ పారిశ్రామికవేత్త ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారని, దాంతో నయీంను ఎట్టి పరిస్థితిలోనూ పట్టుకోవాలని కెసిఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.
ఆ పారిశ్రామికవేత్తతో పెట్టుకోవద్దని అనుచరులు చెప్పినా నయీం విలేదని అంటారు. అప్పటికే మాజీ మావోయిస్టులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కోనాపురి సాంబశివుడు, రాములులను నయీం గ్యాంగ్ హత్య చేసింది. దాంతో నయీం తెరాస నాయకులతో సంబంధాలను కొనసాగించలేకపోయాడని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతనికి రాజకీయ నాయకుల నుంచి, పోలీసు పెద్దల నుంచి రక్షణ ఉండేది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నయీంకు ఆ మద్దతు లభించలేదు. దాన్ని గుర్తించకుండా నయీం దూకుడు ప్రదర్శించాడని చెబుతారు. అప్పటికే నయీంపై తెరాస నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు నయీం గ్యాంగ్ వ్యవహారాలపై ఫిర్యాదు చేస్తూ వచ్చారని చెబుతారు.