నేతల్ని హీరోలు, జీరోలు చేసేది మీరే, పొద్దున మీరే గుర్తొస్తారు: నాయిని, అలీ
హైదరాబాద్: రాజకీయ నాయకులను హీరోలు, జీరోలను చేసేది పాత్రికేయులేనని (జర్నలిస్టులు) తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి శనివారం నాడు అన్నారు. జర్నలిస్టులు రాజకీయాలకు బధీ కావొద్దని, తటస్థంగా ఉండాలని హితవు పలికారు.
ఉదయం లేచి పత్రికలు చూస్తే పాత్రికేయులే గుర్తుకు వస్తారని చెప్పారు. పాత్రికేయులకు చాలా సమస్యలు ఉన్నాయని, వాటి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సానుకూలంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ప్రెస్ క్లబ్ హైదరాబాద్ స్వర్ణోత్సవంలో భాగంగా శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీనియర్ పాత్రికేయులకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. గవర్నర్ నరసింహన్ మంచి శుభవార్త చెప్పేందుకు వస్తారని పాత్రికేయులతో నాయిని అన్నారు. ఇల్ల స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సమాజంలో జర్నలిస్టులది ముఖ్య పాత్ర అన్నారు.
స్వర్ణోత్సవాలు జరుపుకోవడం, సీనియర్ పాత్రికేయులను సన్మానించుకోవడం అభినందనీయమని మహమూద్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ జర్నలిస్టుల కోసం మంచి పథకాలను తీసుకు వస్తామన్నారు. జర్నలిస్టులు విలువలు పాటిస్తూ ముందుకు పోవాలన్నారు.
కాగా, నాయిని రెండు రోజుల క్రితం జైల్లో పరిస్థితులు చూసి బయట ఉన్నవారూ వస్తారేమోనని నవ్వుతూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర జైల్లలో ఉన్న పరిస్థితులు చూసి బయట సాధారణ జీవితం గడుపుతున్న వారు కూడా వస్తారేమోనని అన్నారు.