ఆరు దశాబ్దాల పోరాట ఫలితం.. ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు నిదర్శనం...
ఆరు దశాబ్దాల పోరాటం. ఎన్నో ఉద్యమాలు, మరెన్నో బలిదానాల ఫలితం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్బవించిన తెలంగాణ ఐదు వసంతాలు పూర్తిచేసుకుని ఆరో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. స్వపరిపాలనలో అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధిస్తున్న తెలంగాణ దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఆరు దశాబ్దాల ఆకాంక్ష
తెలంగాణ స్వరాష్ట్రం, సొంత పరిపాలన కోసం దశాబ్దాల పాటు సాగిన పోరాటం చరిత్రలో నిలిచిపోయాయింది. తొలి, మలి దశ ఉద్యమాలు జరిగిన తీరు ఆ సందర్భంగా ఎదురైన సంఘటనలు గుర్తు చేసుకుంటే హృదయం చెమ్మగిల్లుతుంది. 2001లో ప్రారంభమైన ఉద్యమం దాదాపు 13 ఏళ్ల పాటు నిరంతరాయంగా కొనసాగించింది. 2012లో పడిలేచిన కెరటమై విజృంభించింది. పిల్ల, పెద్దా, ముసలి ముతకా, పేద, ధనిక తేడాలేదు.. పల్లె నుంచి పట్నాల వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ గొంతుక వినిపించింది.
స్వరాష్ట్రం కోసం ఎన్నో బలిదానాలు
అగ్నికి ఆహుతైన శ్రీకాంతా చారి, పార్లమెంట్ వద్ద యాదిరెడ్డి బలిదానం, ఓయూ విద్యార్థులపై విరిగిన లాఠీలు.. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చులు, పెన్ డౌన్లు, రోడ్లపై వంటా వార్పులు ఇలా ఎన్నో త్యాగాల ఫలితం తెలంగాణ. స్వరాష్ట్ర సాధన కోసం ప్రజలు చేసిన పోరాటం అనితర సాధ్యం. స్వపరిపాలన కోసం సాగిన పోరాటంలో ప్రతి ఒక్క తెలంగాణవాసి ఏదో ఒక రూపంలో పాల్గొన్నవారే. తెలంగాణ సాధనలో తమ భాగస్వామ్యాన్ని
బలవంతపు బంధం
నిజానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును తెలంగాణ ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇది తాత్కాలిక బంధమే ఎప్పుడైనా విడిపోవచ్చన్న ఆపద్ధర్మ సూత్రంతో రెండు ప్రాంతాలకు ముడివేశారు. అప్పటి నుంచి 2014 వరకు పరాయిపాలనలో రాష్ట్రం అరిగోస పడింది. ముల్కీ నిబంధనలు బేఖాతరు చేయడం, తెలంగాణేతరుల ఆధిపత్యం పెరగడం, పాలనలో వాళ్ల బలం పెరగడం, ఇవన్నీ తమకు కలిగిన అన్యాయంపై జనం ఉద్యమబాట పట్టేలా చేసింది. 1969లో అది ఉద్ధృతరూపం దాల్చింది. అప్పుడు ఊపిరిపోసుకున్న జై తెలంగాణ నినాదం అలసట లేకుండా ఆరు దశాబ్దాల పాటు మార్మోగింది.
గల్లీ గల్లీలో రణ నినాదం
తెలంగాణ సాధన ఉద్యమం మరో నిజాం వ్యతిరేక పోరాటాన్ని ఆవిష్కరించింది. పల్లె పట్నం తేడాలేకుండా చినుకులా మొదలైన ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. పార్టీలు, కులాలు మతాలకు అతీతంగా గల్లీ గల్లీల్లో తెలంగాణ నినాదం వినిపించింది. కార్యాలయాలు, కాలనీలు, ఖార్జానాలు, ఉత్సవాలు, పండుగలు, సభలు, సమావేశాలు వేదిక ఏదైనా, సందర్భమేదైనా తెలంగాణ స్వేచ్చ కోసం గళాలన్నీ నిప్పుకణాలు విరజిమ్మాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, వ్యాపారులు, కవులు, కళాకారులు సమరాన్ని చల్లారకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమాన్ని నడిపిందారు.
చరిత్రలో అద్భుత ఘట్టం
భారత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఓ ప్రత్యేక అధ్యాయం. ఢిల్లీ పెద్దలను ఒప్పించి, అన్ని పార్టీలను ఒక్కతాటిపైకి రప్పించి, అనేక ప్రతికూలతల మధ్య స్వరాష్ట్ర సాకారాన్ని సాకారం చేసుకున్నారు తెలంగాణ ప్రజలు. ఆరు దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసి అనుకున్నది సాధించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నందునే తెలంగాణ ఆవిర్భావం జాతి చరిత్రలో అద్భుత ఘట్టం.