సీఎం కెసీఆర్కు అన్ని హంగులతో కొత్త ఇల్లు, రూ.30 కోట్లతో నిర్మాణం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నూతన అధికార నివాసం నిర్మించనున్నారు. రూ.30 కోట్లతో అన్ని హంగులతో దీనిని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న బేగంపేట సీఎం క్యాంప్ కార్యాలయం ఇరుకుగా ఉందని భావించి కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతమున్న సీఎం క్యాంప్ కార్యాలయం నివాసం ఇరుకుగా ఉండటమే కాకుండా, సరైన వసతులు లేవు. దీంతో కొత్త ఇంటిని నిర్మించేందుకు ప్రభుత్వం స్థలాన్ని అన్వేషిస్తోంది. నగరంలోని అనేక ప్రాంతాలను అధికారుల బృందం గతంలో పరిశీలించి వచ్చింది. కానీ, ఎక్కడా సరైన స్థలం లభ్యం కాలేదు.
దీంతో ప్రస్తుతం బేగంపేటలో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం సమీపంలోని ఐఏఎస్ అధికారుల అసోసియేషన్, క్లబ్ పరిసరాల్లోనే నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్లబ్ ప్రాంతంతో పాటు దానికి సమీపంలోని కొన్ని ఐఏఎస్ అధికారుల క్వార్టర్లను తొలగించి నూతన నిర్మాణాలు చేపట్టనున్నారు.
ముఖ్యమంత్రి నూతన అధికారిక నివాసం కోసం రూ.30 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. డిజైన్లనూ ఆమోదించారు. సీఎం అధికారిక నివాసం కోసం మొత్తం తొమ్మిది ఎకరాలను సమీకరిస్తున్నారు. ఇందులోని 2ఎకరాల్లో ముఖ్యమంత్రి నివాసానికి కేటాయిస్తారు.
ఇందులో 250 నుంచి వెయ్యి మంది కూర్చునేలా మల్టీపర్పస్ హాలు నిర్మిస్తారు. అవసరమైతే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దపెద్ద సమావేశాలను ఇక్కడే నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో మంత్రివర్గ, ఇతర ముఖ్యమైన సమావేశాల నిమిత్తం ఓ హాలును కూడా నిర్మించ తలపెట్టారు.
నూతన భవనంలో 300 వాహనాలను నిలిపేందుకు తగిన వసతిని ఏర్పాటు చేయనున్నారు. సీఎంను కలిసి విజ్ఞప్తులు అందజేసే సాధారణ ప్రజల కోసమూ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ నివాసానికి సంబంధించిన పనులు చేపట్టేందుకు పది రోజుల్లో టెండర్లు ఖరారు కానున్నాయి.
ఆరు నెలల్లోనే పనులను పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. సేకరించిన తొమ్మిది ఎకరాల్లో ముఖ్యమంత్రి నివాసానికి రెండు ఎకరాలు పోను, మిగతా స్థలాన్ని ఆయన సిబ్బంది, ఇతర అధికారుల ఇళ్ల కోసం కేటాయించనున్నారు. మరోవైపు, ఇప్పుడు ఉన్న భవనాన్ని స్వల్ప మార్పులు చేసి, ముఖ్యుల కోసం కేటాయించే అవకాశముంది.