తొలిరోజు నుంచే పాలన: ప్రతీ కొత్త జిల్లాకు రూ. కోటిన్నర నిధులు
హైదరాబాద్: దసరా నుంచి కొత్త జిల్లాలు మాత్రమే కాకుండా, అదే రోజునుంచి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మండలాలు, రెవిన్యూ డివిజన్లనుంచి పాలన ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ముందు కొత్తగా ఏర్పాటు చేయబోయే మండలాలను నిర్దారించాలని, తర్వాత రెవిన్యూ డివిజన్ల కూర్పు జరగాలన్నారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో తొలిరోజు (దసరా) నుంచే రెవిన్యూ, పోలీస్ శాఖలు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారు.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంగళవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశం నిర్వహించారు. మంత్రులు జగదీశ్రెడ్డి, మహేందర్రెడ్డి, సీఎస్ రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దసరానుంచి అమల్లోకి రానున్న కొత్త జిల్లాల కలెక్టరేట్లలో తాత్కాలిక ఏర్పాట్ల కోసం రూ.కోటి, జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాటుకు రూ.50 లక్షల చొప్పున తక్షణం మంజురు చేస్తున్నట్టు ప్రకటించారు. 'ఓ కుటుంబం ఇల్లు మారినప్పుడు వచ్చే సమస్యలాంటివే, కొత్త జిల్లాల ఏర్పాటుతోనూ వస్తాయి. వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి సారించాలి' అని కలెక్టర్లకు సిఎం సూచించారు.
మొదట కలెక్టరేట్లు, డివిజన్లు, మండలాల వ్యవస్థ ఏర్పాటు జరిగిన తర్వాత ఇతర శాఖల కార్యాలయాలు, సిబ్బంది నియామకం జరగాలని ఆదేశించారు. మండల, డివిజన్, జిల్లా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు, అధికారుల నియామకం తదితర అంశాలను కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. ఆయా ప్రాంతాల స్వభావం, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలో అంటు రోగాలు ఎక్కువ. అలాంటిచోట వైద్య, ఆరోగ్యశాఖ విభాగాలు పూర్తిస్థాయిలో ఉండాలన్నారు, ఏజెన్సీ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో పని చేయడానికి అన్ని విభాగాలకు అధికారుల నియామకం జరగాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు ఎక్కువ అవసరం ఉంటుందన్న అంచనతో కొత్త ఉద్యోగుల నియామకం జరగాలని సూచించారు.
అధికార యంత్రాంగం సమర్దవంతంగా పని చేయడం, ప్రజలకు పాలనను చేరువచేయడం, శాంతి భద్రతలను పకడ్బందీగా పర్యవేక్షించడం జరగాలన్నారు. జిల్లాల పరిధి తగ్గడం ద్వారా ప్రతి కుటుంబంపై కలెక్టర్కు అవగాహన కలుగుతుందని, సంక్షేమ కార్యక్రమాల అమలు, పూర్తిస్థాయి పర్యవేక్షణకు చిన్న పరిపాలన విభాగాల ఏర్పాటు వల్లనే సాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు.
జిల్లా యూనిట్లు చిన్నగా ఉండటంవల్ల ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ సులువు అవుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. కొత్తగా మరో 30 మండలాలు రాష్టవ్య్రాప్తంగా 75 కొత్త మండలాల ఏర్పాటుకు డిమాండ్లు రాగా, ఇప్పటికే 45 మండలాలకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. మరో 30 మండలాల కోసం వచ్చిన డిమాండ్లపై సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారని సీఎం కెసిఆర్ వివరించారు.
అధికారుల తీరుపై సీఎం అసంతృప్తి
సమావేశంలో అధికారుల తీరుపై సీఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అసంపూర్తి ప్రతిపాదనలతో సమావేశానికి రావటం మీద ఆగ్రహం వ్యక్తం చేసి.. ఎలాంటి సమాచారం సిద్ధం చేయకుండా నన్నెందుకు పిలిచారు? అని ప్రశ్నించినట్టు సమాచారం. 'అసంపూర్తి కసరత్తు వద్దు.. పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయండి. స్పష్టతతో రండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయండి. క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండా ఎలాంటి ప్రతిపాదనలు పంపవద్దు... అసమగ్రంగా, అసంబద్దంగా ఉంటే సహించేది లేదు' అని కెసిఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది.