అమావాస్య.. కరోనా.. తాళిబొట్టు... తెలంగాణలో కొత్త పుకారు..
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. తెలంగాణలో కొత్త కొత్త పుకార్లు కొట్టుకొస్తున్నాయి. ఎవరు పుట్టిస్తున్నారో.. ఎందుకు పుట్టిస్తున్నారో గానీ.. లాక్ డౌన్ పీరియడ్లో జనంలో ఒకరకమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఈ పుకార్లను నమ్మి పాటించేవాళ్లు కొందరైతే.. పాంటించకపోతే ఏమవుతుందోనని లోలోపలే భయపడుతున్నవారు మరికొందరు. లాక్ డౌన్లో మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని నిపుణులు చెబుతున్న వేళ.. ఇలాంటి అనవసర పుకార్లు లేని గందరగోళాన్ని,ఆందోళనను పెంచుతున్నాయి.

ఏంటీ కొత్త పుకారు..
ఏప్రిల్ 23న అమావాస్య దినం. తాజాగా పుట్టుకొచ్చిన కొత్త పుకారు ప్రకారం.. అమావాస్య రోజున ఏదో కీడు జరగబోతుందట. కీడు జరగకుండా ఉండాలంటే పెళ్లయిన ప్రతీ మహిళ తొమ్మిది వరసల దారానికి పసుపు రాసి.. దానితో పసుపు కొమ్ముకు మూడు ముళ్లు వేసి.. భర్తతో దాన్ని మెడలో కట్టించుకోవాలట. ఆపై భర్తతో అంక్షింతలు వేయించుకోవాలట. కొంతమంది దీన్ని కరోనా వైరస్ నివారణతోనూ ముడిపెడుతుండటం గమనార్హం. గత రెండు,మూడు రోజులుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈ పుకారు షికారు చేస్తోంది. ఇంట్లో పసుపు కొమ్ములు లేనివాళ్లు.. అయ్యో ఇప్పుడెలా అంటూ నిట్టూరుస్తున్నారు. కొంతమంది తమ భర్తలతో పసుపు కొమ్ము దారాల్ని మెడలో కట్టించుకుంటూ టిక్టాక్లో వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు.

ఖండించిన అహోబిలం జీయర్ స్వామి..
సోషల్ మీడియాలో అహోబిల జీయర్ స్వామి పేరుతోనూ ఈ పుకారు సర్క్యులేట్ అవుతోంది. దీంతో స్వయంగా ఆయనే దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ నివారణకు ముత్తైదువులు అమావాస్య లోపు ఏడు దారాలతో పసుపుకొమ్ములు ధరించి,అమావాస్య తర్వాత తీసేయాలని తాను చెప్పినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రజలెవరూ దయచేసి దాన్ని నమ్మవద్దన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే.. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఏ రోగమైనా నివారణ కోసం వైద్య చికిత్సే అవసరమని స్పష్టం చేశారు.

ఇటీవల జగిత్యాల,నిజామాబాద్లలోనూ..
అంతకుముందు కూడా ఇలాంటిదే ఓ పుకారు పుట్టుకొచ్చింది. 'ఒక్క కొడుకు ఉన్న తల్లి బోర్ పంప్ ఉన్న ఐదు ఇళ్లల్లో నుంచి బిందెలో నీళ్లు సేకరించి వేప చెట్టుకు పోయాలి. తద్వారా ఆ తల్లికి పుణ్యం ప్రాప్తిస్తుంది.' అని ఓ పుకారు వ్యాపించింది. ఇది నిజమేనని నమ్మి జగిత్యాల,నిజామాబాద్ జిల్లాలతో పాటు పలుచోట్ల చాలామంది మహిళలు బిందెలు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. బోర్ పంప్ ఉన్న ఇళ్ల గురించి ఆరా తీస్తూ నీళ్లు సేకరించారు. ఓవైపు కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం సోషల్ డిస్టెన్స్,లాక్ డౌన్ పాటించాలని చెబుతున్నవేళ.. ఇలాంటి పుకార్లు వాటికి భంగం కలిగించేవిగా మారుతున్నాయి. ప్రజల్లో అనవసర గందరగోళాన్ని రేకెత్తిస్తున్నాయి.












Click it and Unblock the Notifications