మరో సంచలనం: అగ్రిగోల్డ్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్కు 1.5 కోట్ల లంచం?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసు, కర్ణాటకలో కూడా మరో సంచలనాన్ని సృష్టించింది. దేశ వ్యాప్తంగా అగ్రిగోల్డ్ సంస్ధపై కేసులు దాఖలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కర్ణాటకలోని ఉడిపిలో కూడా సంస్ధ ఛైర్మన్, డైరెక్టర్లపై కేసులు నమోదయ్యాయి.
అయితే ఈ కేసు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అగ్రిగోల్డ్ సంస్ధ ఛైర్మన్, డైరెక్టర్లు ఉడిపి కోర్టులోని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు రూ. 1.5 కోట్లు లంచం ఇవ్వజూపారు. ఈ విషయాన్ని అంగీకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వయంగా కోర్టుకు కూడా ఫిర్యాదు చేశారు.
అగ్రిగోల్డ్ సంస్ధ నిర్వాహకులు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అగ్రిగోల్డ్ కేసులో ఎంతో మంది మధ్యతరగతి ప్రజలు బాధితులుగా ఉన్నారు. ఈ కేసులో బాధితులు ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలనే యోచనలో ఉంది.

ఈ క్రమంలో తనను లోబరచుకునేందుకు భారీ ఎత్తున లంచం ఇవ్వజూపారని ఆరోపిస్తూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కర్ణాటక ప్రభుత్వానికి, కోర్టుకు నివేదికను అందించారు. అగ్రిగోల్డ్ అంశంపై గడచిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించారు. అగ్రిగోల్డ్ కేసు మొత్తం 6800 కోట్ల కుంభకోణం కాగా, 32 లక్షల మంది డిపాజిటర్ల బాధితులుగా ఉన్నారు.
ఉమ్మడి హైకోర్టులో అగ్రిగోల్డ్పై కేసు విచారణలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్న హైకోర్టు... ఆస్తుల విక్రయానికి ఓ జ్యూడిషియరీ కమిటీని నియమించింది. బెంగుళూరు, మైసూరు, హోసూరు, ఏపీలోని విజయవాడ సమీపంలో గల ఆస్తులు, మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ ఆస్తులను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications