నూతన వసంతం కబురిది: ‘తెలంగాణ జన సమితి’.. ఇదే కోదండరాం నూతన పార్టీ
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన మూడున్నరేళ్లలో తొలి రాజకీయ పార్టీ పురుడు పోసుకోనున్నది. దానికి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం నేతృత్వం వహించనున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జనవరి నెలాఖరులో పార్టీ రిజిస్ట్రేషన్కు ఏర్పాట్లు జరుగుతాయని తెలుస్తోంది.
జేఏసీ ముఖ్య నేతలులు చెప్పిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెలాఖరుకల్లా తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్రలు పూర్తి కానున్నాయి. అనంతరం కోదండరాం, జేఏసీలో కీలక వ్యక్తులు పార్టీ ఆవశ్యకత, లక్ష్యం, విధి విధానాల రూపకల్పనతోపాటు పార్టీ ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు.
వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సెగ్మెంట్ యూనిట్గా కార్యవర్గం
తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేయనున్న పార్టీకి ఏ పేరు పెట్టాలన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఎక్కువ మంది ‘తెలంగాణ జన సమితి'(టీజేఎస్) పేరు వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దాంతోపాటు ‘తెలంగాణ సకల జన సమితి'వంటి మరో రెండు, మూడు పేర్లపైనా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ పేరుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్గా గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను ఈ వారం రోజుల్లో పూర్తి చేస్తారు.
స్టీరింగ్ కమిటీ, విస్తృతస్థాయి సమావేశం తర్వాతే పార్టీ పేరు
వచ్చే నెల ఏడో తేదీ తర్వాత టీజేఏసీ కోర్ సభ్యులు సమావేశం అవుతారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, రాజకీయ పార్టీగా అవతరించాల్సిన అవశ్యకత, పార్టీ పేరు, లక్ష్యం, విధి విధానాలు, నిర్మాణం వంటి వాటిపై చర్చిస్తారు. అటు పిమ్మట స్టీరింగ్ కమిటీ, జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తారు. ఈ సందర్భంగా వచ్చిన అభిప్రాయాలను క్రోఢీకరించిన తర్వాత ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. 2009లో ఆవిర్భవించిన టీజేఏసీ.. ఉద్యమకాలంలో తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచింది. మిలియన్ మార్చ్, సాగరహారం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో ఉద్యమానికి మార్గనిర్దేశం చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా పోరాట మార్గంలోనే పయనిస్తోంది.
ప్రగతిపై చర్చకు ప్రత్యామ్నాయ విధానాలు
తెలంగాణ ఉద్యమ నినాదాలు, ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా రాజకీయంగా పనిచేయాలని జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదాలుగా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం రాజకీయంగా పోరాడేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, వివిధ వృత్తులు వంటి మౌలిక రంగాల అభివృద్ధికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను రాజకీయంగా చర్చకు పెట్టనున్నారు. తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో స్ఫూర్తి యాత్రలు చేస్తోంది.
హైకోర్టు జోక్యంతో ఇలా కొలువుల కొట్లాట సభ
నల్లగొండ జిల్లాలో స్ఫూర్తి యాత్ర ఇంకా జరుగుతోంది. ఇది పూర్తయితే ఈ యాత్ర దాదాపుగా పూర్తి అవుతుంది. భూనిర్వాసితుల హక్కుల కోసం కూడా జేఏసీ ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టింది. డిసెంబర్ మొదటివారంలో తెలంగాణ నిరుద్యోగ గర్జన నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకున్నా హైకోర్టు ద్వారా అనుమతి సాధించి ‘కొలువుల కొట్లాట'సభ నిర్వహించింది.