నేషనల్ హైవేస్ పై పశువులతో ప్రమాదాలు.. NHAI సూపర్ నిర్ణయం!
జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్న ఎన్హెచ్ఏఐ తాజాగా మరో కీలక నిబంధనలను తీసుకు వచ్చింది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై సంచరించే పశువులు, వీధి జంతువుల వల్ల ఏర్పడుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలను రూపొందించింది. ఈ నియమాలు అమలులోకి వస్తే రహదారులపై జంతువుల సంచారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నారు. కొత్త నిబంధనల ప్రకారం జాతీయ రహదారి సంస్థలు అన్ని జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేల పైన ఉన్న జంతువులను అక్కడ నుండి తరలించాలి. రహదారులపై పశువులను వదిలేసే యజమానులపై కఠిన జరిమానాలు, శిక్షలు విధించనున్నారు. ఇలా చేయడం వల్ల యజమానులు జాగ్రత్తగా ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

రోడ్డుపై జంతువులు తిరగడం వల్ల కార్లు, ట్రక్కులు ఢీకొని అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ జంతువులను గుర్తించి రాష్ట్ర, స్థానిక అధికారులు నిర్వహించే షెల్టర్లు లేదా పౌండ్లకు తరలించే బాధ్యతను ఎన్హెచ్ఏఐ చేపడుతుంది. ఈ తరలింపు ఖర్చును కూడా సంస్థే భరిస్తుంది. అయితే జంతు షెల్టర్లు, పౌండ్లను ఏర్పాటు చేసి నిర్వహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది.
రాష్ట్రాలు ఈ మేరకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులపై పశువుల సంచారం చాలా కాలంగా తీవ్ర సమస్యగా మారింది. అనేక ప్రమాదాల్లో జంతువులు కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతోంది. డ్రైవర్లు అకస్మాత్తుగా జంతువులను చూసి బ్రేక్లు వేయడం వల్ల వెనుక వాహనాలు ఢీకొనే సంఘటనలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ కొత్త నిబంధనలు తీసుకురావడం ప్రమాదాలను నివారించే నిర్ణయం గా కనిపిస్తుంది.
ఈ నియమాలు అమలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, పోలీసు శాఖ సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. యజమానులకు అవగాహన కల్పించి, జంతువులను రోడ్డుపై వదలకుండా చూడాలి. అలాగే షెల్టర్లు సరిగా నిర్వహించబడితే జంతువులకు కూడా సురక్షితమైన ఆశ్రయం లభిస్తుంది. ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేలా రహదారులను జంతువుల రహితంగా ఉంచాలని లక్ష్యంగా ఎన్హెచ్ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం రోడ్డు భద్రతను పెంచడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
