భారత ప్రభుత్వంపై కుట్ర: తెలంగాణ, ఛత్తీస్గఢ్లో ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్: తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు చోట్లలో ఎన్ఐఏ(NIA) అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక, ఛత్తీస్గఢ్ రాస్ట్రంలోని బీజాపూర్లోనూ సోదాలు నిర్వహించి.. కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
జూన్ నెలలో చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురిని అరెస్ట్ చేసిన స్థానిక పోలీసులు.. భారీగా పేలుడు పదార్థాలు, డ్రోన్లు, తయారీ యంత్రాంగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగానే ఆగస్టులో మరో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు.. దానిపైనా దర్యాప్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టులకు ఆయుధాలు, సామాగ్రిని సరఫరా చేస్తున్నారన్న అభియోగంపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పట్టుబడిన ముగ్గురి ప్రాథమిక విచారణలో పీపుల్స్ వార్ పేరుతో మావోయిస్టు కార్యకలాపాలకు పంపుతున్నారన్నారు.
నూతన సాంకేతికతను ఉపయోగించి సీపీఐ మావోయిస్టు పార్టీ యువకులను రిక్రూట్మెంట్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. భారత ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఉద్దేశంతో వివిధ రకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వామపక్ష తీవ్రవాద సంస్థ సీపీఐ(మావోయిస్టు) పాల్పడుతోందని ఎన్ఐఏ పేర్కొంది. ఈ సంస్థకి లాజిస్టిక్ మద్దతును అందించడంలో నిందితుడి ప్రమేయాన్ని తెలుసుకునేందుకు.. స్వాధీనం చేసుకున్న పరికరాలు, పత్రాలు ఉపయోగపడతాయన్నారు. వాటి పరిశీలన జరుగుతోందన్నారు.
నిషిద్ధ సంస్థకు భారతదేశ వ్యతిరేక ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిందితులు ప్రాథమికంగా ముడి సరుకును అందించారని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ సంస్త ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల్లో తన హింసాత్మక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆధునిక సాధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ప్రారంభించిందని తెలిపింది.












Click it and Unblock the Notifications