పాతబస్తీలో ఎన్ఐఏ బృందాల సెర్చ్ ఆపరేషన్: పలువురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బృందాలు తనిఖీలు నిర్వహించాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎన్ఐఏ బృందాలు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నవారి ఇకోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
పాతబస్తీ పరిధిలోని షాహిన్నగర్, పహాడిషరీఫ్లో ఎన్ఐఏ బృందాలు గాలిస్తున్నాయి. ఐసిస్ ఉగ్రవాద కేసుల్లో అనుమానితులుగా ఉన్న కొందరు వ్యక్తులు ఈ ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు ఎన్ఐఏకు సమాచారం రావడంతో వెంటనే మూడు బృందాలు రంగంలోకి దిగాయి.
వరంగల్కు చెందిన కుదూస్ అనే వ్యక్తి కోసం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం కుదూస్తో పాటు బాసిత్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. స్థానిక పోలీసుల సాయంతో ఎన్ఐఏ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి.
కాగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్న బృందాలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అంతేగాక, ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఎండీ అజీమ్ షాన్, ఎండీ ఒసమా అలియాస్ అదిల్ అలియస్ పీర్, అకాలకుర్ రెహ్మాన్ అలియాస్ అక్లక్, మహ్మద్ మెహ్రాజ్ అలియాస్ మోనూ, మోహ్సిన్ ఇబ్రహీం సయ్యద్, ముదాబ్బిర్ ముస్తాక్ షేక్లను అధికారులు జ్యూడీషియల్ కస్టడీకి తీసుకున్నారు.